Modi Meloni Gift: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ఇచ్చిన ఒక చిన్న కానుక.. భారత షేర్ మార్కెట్లో విచిత్ర పరిస్థితికి దారి తీసింది. ఇన్వెస్టర్లు.. పప్పులో కాలేసి ఒక షేరుకు బదులు మరో కంపెనీ షేర్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఖంగు తిన్నారు. ప్రధాని మోదీ దౌత్యపరమైన ఒక నిర్ణయం కాస్త.. మదుపర్లను దారుణంగా బురిడి కొట్టించిందని జాతీయ మీడియాలో సైతం పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అసలు ఈ పరిస్థితికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రదాని జార్జియా మెలోనికి ఆసక్తికరమైన బహుమతిని ప్రధాని అందజేశారు. మెలోనీ పేరుకు దగ్గరగా ఉన్న ‘మెలోడీ’ చాక్లెట్ ప్యాక్ ను ఆమెకు అందించారు. ఈ సందర్భంగా దానిని స్వీకరిస్తూ మెలోనీ ఓ వీడియో తీశారు. ‘గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్యూ’ అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ వీడియోలో ప్రధాని మోదీ.. మెలోడీ పేరుతో ఉన్న చాక్లెట్ ప్యాక్ ను చూపించగా.. దానికి మెలోనీ పెద్దగా నవ్వుతూ సరదాగా కనిపించారు. ఈ వీడియో క్షణాల్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఇటలీ ప్రధాని మెలోనికి PM మోదీ మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్గా ఇచ్చారు. దానిని ఆమె స్వీకరిస్తూ వీడియో తీసుకున్నారు. 'గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్యూ' అని Xలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా 'మెలోడీ' అంటూ వారిద్దరూ సరదాగా నవ్వుకోవడం ఆకట్టుకుంటోంది.pic.twitter.com/QyY4fnyQyn
— ChotaNews App (@ChotaNewsApp) May 20, 2026
ఈ వీడియో వైరల్ కావడంతో భారత స్టాక్ మార్కెట్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ పైన ఉన్న ‘పార్లే’ (Parle) అనే పేరు భారత ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఉత్సాహంతో మార్కెట్లో ‘పార్లే’ (Parle) పేరున్న షేర్ల కోసం వెతికారు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో లిస్ట్ అయి ఉన్న ‘పార్లే ఇండస్ట్రీస్’ (Parle Industries) అనే కంపెనీని చూసి.. ఇదే ఆ మెలోడీ చాక్లెట్లను తయారు చేసే కంపెనీ అని పొరబడ్డారు. ఎగబడి ఆ షేర్లను కొనడం ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగిపోయి.. ఆ కంపెనీ షేరు ధర 5 శాతం పెరిగి రూ. 5.25 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకింది.
ఇన్వెస్టర్లు తొందరపడి కొన్న ‘పార్లే ఇండస్ట్రీస్’ కంపెనీకి.. ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చిన మెలోడీ చాక్లెట్లకు ఎలాంటి సంబంధం లేదని ఆ తర్వాతే తెలిసింది. అందరికీ సుపరిచితం అయిన పార్లే-జి బిస్కట్లు, కిస్మి, మ్యాంగో బైట్ వంటివి తయారు చేస్తున్న ‘పార్లే ప్రొడక్ట్స్’ (Parle Products) సంస్థనే ఈ మెలోడీ చాక్లెట్లను సైతం తయారు చేస్తోంది. ఇది పూర్తిగా ప్రైవేట్ కంపెనీ. అసలు స్టాక్ మార్కెట్లోనే లిస్ట్ కాలేదు. ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన ‘పార్లే ఇండస్ట్రీస్’ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. పొరపాటున ఆ సంస్థే మెలోడి చాక్లెట్లను తయారు చేస్తోందని భావించి.. ఇన్వెస్టర్లు దారుణంగా మోసపోయారు. చివరికి నిజం తెలుసుకొని ఖంగుతిన్నారు.
Also Read: సమ్మర్లో కరెంటు బిల్లు వేధిస్తోందా? ఈ 5 ‘ఎకో ఫ్రెండ్లీ’ అలవాట్లతో.. సగానికి సగం ఆదా!
కేవలం పేరులో ‘పార్లే’ అని ఉండటం.. పైగా మోదీ-మెలోని వీడియో ట్రెండ్ అవుతుండటంతో ఎలాంటి పరిశోధన లేకుండానే ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేయడం ఈ గందరగోళానికి ప్రధాన కారణంగా నిలిచింది. గతంలోనూ ఇలాంటి ఒకే పేరు పోలికల వల్ల తప్పుడు కంపెనీల షేర్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రధాని మోదీ ఇచ్చిన ఒక చిన్న చాక్లెట్ కానుక.. అటు ఇంటర్నెట్ను, ఇటు స్టాక్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఇకనైనా సోషల్ మీడియా ట్రెండ్స్ ను నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఇన్వెస్టర్లు చెక్ చేసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. బట్టలు బాగా ఉతికేది ఏది? ఇంటికి ఏ వాషింగ్ మిషన్ బెస్ట్?