Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్ల పవనాలు దేశీయ స్టాక్ మార్కెట్ పై పడింది. ఫలితంగా సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే దలాల్ స్ట్రీట్లో బేర్ వీర విహారం చేసింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1200 పాయింట్లు పైగా పతనమైంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి మెల్లగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి కారణం ఏమిటి?
దలాల్ స్ట్రీట్లో బేర్ హంగామా.. భారీగా స్టాక్మార్కెట్ పతనం
సోమవారం ఉదయం భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. తొలుత బీఎస్ఈ సెన్సెక్స్ 961 పాయింట్లు క్షీణించింది. ఆ తర్వాత క్రమంగా 1200 పాయింట్లు వరకు చేరింది. ఉదయం 11 గంటలకు 900 పాయింట్లు నష్టపోయి ఊగిసలాడుతోంది. అటు నిఫ్టీ కూడా ఒకానొక దశలో 350 పాయింట్లు పైగానే పతనమైంది. ఆ తర్వాత మెల్లగా కొలుకునే ప్రయత్నం చేస్తోంది.
బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసు భారీగా పతనమయ్యాయి. ఐటీ, ఫార్మా రంగాలు కాస్త కోలుకున్నట్లు కనిపిస్తోంది. బీఎస్ఈ, నిఫ్టీలు ఒక శాతంపైగా పతనమైంది. ఇంట్రాడే సెన్సెక్స్ కనిష్ట స్థాయి అంటే 76,166 పాయింట్లకు చేరింది. తర్వాత మెల్లగా కోలుకుంటోంది.
మోదీ పొదుపు మంత్రం.. గోల్డ్ కంపెనీల షేర్లు ఢమాల్
ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 కూడా 1 శాతం పతనమై రోజు కనిష్ట స్థాయి 23,845 పాయింట్లకు చేరింది. మెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తోంది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లోని రూ. 473.5 లక్షల కోట్ల నుంచి రూ. 468 లక్షల కోట్లకు పడిపోయింది. ఫలితంగా పెట్టుబడిదారులు దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మార్కెట్ ఈ స్థాయిలో పతనం కావడానికి కారణాలు తెలుసుకుందాం. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవుతున్నవార్తలు మార్కెట్ వర్గాలను తాకింది. దీనికితోడు ప్రధానమంత్రి మోదీ పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు, వ్యక్తిగత వాహనాలు తగ్గించి ప్రజా రవాణా వినియోగం పెంచాలని చెప్పడం, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని పిలుపు ఇవ్వడం కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: రాబోయే ముప్పును పసిగట్టిన ప్రధాని మోదీ.. బంగారం కొనుగోళ్లపై కీలక సూచన
మరోవైపు బలహీనపడుతున్న రూపాయి ప్రభావం కూడా స్టాక్ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం 95.18 పైసలు వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. అన్నింటి కంటే ఎక్కువగా జ్యూవెలరీ విభాగం ఐదుశాతం పైగానే నష్టపోయింది. పశ్చిమాసియా ఘర్షణను మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితికి కారణమని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
ఈ అనిశ్చితి కారణంగా రెండు నెలలకు పైగా ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా కొనసాగుతోంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి వేగం కోల్పోతుందనే భయాలను క్రమంగా పెంచుతోంది.