UPI Charges: ఈ రోజుల్లో యూపీఐ (Unified Payments Interface) ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కూరగాయల కొనుగోలు నుంచి షాపింగ్ మాల్స్ వరకూ అంతా డిజిటల్ రూపంలో చెల్లిస్తున్నారు. ఫలితంగా ఏటా బిలియన్ల కొద్దీ లావాదేవీలతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థగా ప్రస్తుతం యూపీఐ మారింది. అయితే తాజాగా పార్లమెంటులో ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు – 2026’ను ఆమోదించిన తర్వాత ఒక్కసారిగా యూపీఐ చర్చ మెుదలైంది. భవిష్యత్తులో యూపీఐ సేవలపై ఛార్జీలు విధిస్తారని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అందులో వాస్తవమెంత? అసలు యూపీఐ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తోంది? భవిష్యత్తులో తీసుకొచ్చే మార్పులేంటి? ఈ కథనంలో తెలుకునే ప్రయత్నం చేద్దాం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన ఒక అత్యంత వేగవంతమైన రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థే ఈ యూపీఐ. బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్లు పదే పదే నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ఫోన్ ద్వారా క్షణాల్లో డబ్బులు బదిలీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ నంబర్ ద్వారా ఏ సమయంలోనైనా (24×7) పేమెంట్లు చేయవచ్చు. ఒక్క యూపీఐ నెంబర్ కే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను అనుసంధానించుకునే వెసులుబాటు ఉంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ (BHIM) వంటి ప్రజాదరణ పొందిన యాప్లన్నీ ఈ నెట్వర్క్ పైనే పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం సాధారణ వినియోగదారులందరికీ యూపీఐ సేవలు పూర్తిగా ఉచితం. బ్యాంక్ ఖాతా నుండి నేరుగా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించినప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీ పడదు. దీనికి కారణం కేంద్రం ఇచ్చిన ఎండీఆర్ మినహాయింపే. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి 2020లో కేంద్రం.. యూపీఐ, రుపే డెబిట్ కార్డులపై ఎండీఆర్ (MDR) రుసుమును రద్దు చేసింది. అప్పటి నుంచి వినియోగదారులతో పాటు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు పడటం లేదు.
వినియోగదారులకు యూపీఐ ఉచితంగానే అందుతున్నప్పటికీ.. ఆ వ్యవస్థను నిర్వహించడం మాత్రం ఫ్రీ కాదు. సర్వర్ల నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, లావాదేవీల ప్రాసెసింగ్, కొత్త టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎండీఆర్ రద్దు చేసినప్పటి నుంచి ఈ భారాన్ని బ్యాంకులు, కంపెనీలే భరిస్తున్నాయి. కేంద్రం కొద్దిమేర ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ.. భారీగా పెరిగిపోతున్న లావాదేవీల వల్ల వీటి యూపీఐ సర్వర్ల నిర్వహణ భారం రోజు రోజుకు పెరిగిపోతోంది.
కాబట్టి యూపీఐ వ్యవస్థను సుదీర్ఘకాలం సమర్థవంతంగా నడవాలంటే వ్యాపారులపై స్వల్ప స్థాయిలో అయిన ఎండీఆర్ విధిస్తే బాగుంటుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ కు ఇటీవల ప్రతిపాదనలను సైతం పంపాయి. మరోవైపు దీనిని వ్యతిరేకించే వారి వాదన మరోలా ఉంది. యూపీఐ అనేది దేశ డిజిటల్ మౌలిక వసతుల్లో కీలక భాగమని, దానిపై ఛార్జీలు వేస్తే డిజిటల్ లావాదేవీలు తగ్గే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. కాబట్టి ఛార్జీలు విధించకుండా ప్రభుత్వమే మద్దతుగా నిలవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read: కేంద్రంతో రూ.5,000 కోట్ల వివాదం.. Airtel, Vi కు సుప్రీం కోర్టు నోటీసులు!
కొత్తగా తీసుకొచ్చిన చట్ట సవరణ తక్షణమే ఎలాంటి ఛార్జీలను విధించదు. భవిష్యత్తులో అవసరమైతే ఎండీఆర్ ఫ్రేమ్వర్క్ను నోటిఫై చేసే అధికారాన్ని మాత్రమే ఇది ప్రభుత్వానికి ఇస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు. వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని, ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఎండీఆర్ తీసుకొచ్చినా ఆ భారం వ్యాపారులపైనే ఉంటుంది తప్ప సాధారణ ప్రజలపై పడదని హామీ ఇచ్చారు. కాబట్టి యూపీఐ వాడేవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎప్పటిలాగే రూపాయి కూడా ఖర్చు లేకుండా సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: మెటాకు భారీ షాక్.. ఏకంగా రూ.4,700 కోట్ల ఫైన్.. ఇంతకీ కేసు ఏంటంటే?