Spectrum Charges: టెలికాం రంగంలో అత్యంత కీలకమైన ‘వన్-టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జెస్’ (OTSC) వివాదంపై కేంద్ర ప్రభుత్వం వేసిన అప్పీల్పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) జారీ చేసిన డిమాండ్ నోటీసులను బాంబే హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
‘వన్-టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జెస్’ (OTSC)కు సంబంధించి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాకు రూ.5000 కోట్ల డిమాండ్ నోటీసులను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ జారీ చేయడంపై వివాదం తలెత్తింది. దీనిపై సదరు టెలికాం సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని హైకోర్టు పేర్కొంది. ఒప్పందంలో లేని ఆర్థిక భారాలను కాలం గడిచాక ఏకపక్షంగా విధించలేమని స్పష్టం చేస్తూ గతంలో DoT నోటీసులను రద్దు చేసింది.
బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. కేంద్రం ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్ బెనర్జీ వాదనలు వినిపించారు. 2G స్పెక్ట్రమ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యల ఆధారంగానే మళ్లీ సమానత్వాన్ని తీసుకురావడానికి ఈ OTSC ఛార్జీలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
స్పెక్ట్రమ్ వినియోగానికి సరైన మార్కెట్ ధరను వసూలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్ బెనర్జీ అన్నారు. ఇది కేవలం లైసెన్స్ ఒప్పందాల ఆధారంగా కాకుండా.. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 4 కింద లభించిన చట్టబద్ధమైన అధికారాల ద్వారా జారీ చేసిన నిర్ణయమని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని కాపాడటమే తమ లక్ష్యమని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల తరఫున సీనియర్ అడ్వొకేట్లు శ్యామ్ దివాన్, ముకుల్ రోహత్గి, బల్బీర్ సింగ్ హాజరై కేంద్రం వాదనలను తీవ్రంగా ఖండించారు. లైసెన్స్ పొందిన సమయాల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చెల్లింపులన్నీ పూర్తి చేశామని వివరించారు. ఎప్పుడో 1990ల నాటి వ్యవహారాలకు సంబంధించి దశాబ్దాల తర్వాత అకస్మాత్తుగా రూ.5,000 కోట్ల భారీ డిమాండ్ నోటీసులు ఇవ్వడం వల్ల వాణిజ్యపరమైన స్థిరత్వం దెబ్బతింటుందని రోహత్గి పేర్కొన్నారు. బాంబే హైకోర్టు ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి సరైన తీర్పునే ఇచ్చిందని స్పష్టం చేశారు.
Also Read: రీల్స్ అలా చూశాడో లేదో.. ఖాతా నుంచి రూ.లక్ష స్వాహా.. ఇదో కొత్త రకం సైబర్ స్కామ్!
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ప్రభుత్వానికి ఉన్న అధికారాలను నిర్ధారించాల్సి ఉందని పేర్కొంది. దీంతో మద్రాస్ హైకోర్టు పరిధిలోని ఇలాంటి కేసులతో దీనిని కలిపి విచారించాలని కేంద్రం కోరగా.. టెలికామ్ కంపెనీల లాయర్లు దానిని వ్యతిరేకించారు. ఈ క్రమంలో రెండు వైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు, కేంద్రం అప్పీల్పై టెలికాం కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ తమ సమాధానాలను దాఖలు చేయాలని ఆదేశించింది.
Also Read: మెటాకు భారీ షాక్.. ఏకంగా రూ.4,700 కోట్ల ఫైన్.. ఇంతకీ కేసు ఏంటంటే?