Zomato Fee Hike: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి వసూలు చేసే ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ఒక్కో ఆర్డర్కు రూ. 2.40 మేర పెంచి ఫైనల్ గా రూ. 14.90 వసూలు చేస్తునట్లు శుక్రవారం ప్రకటించింది. గతంలో రూ. 12.50గా ఉన్న ప్లాట్ఫామ్ ఫీజును రూ. 14.90లకు పెంచింది. మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీజును జీఎస్టీతో కలిపి రూ. 14.99 వసూలు చేస్తుంది.
జొమాటో నిర్వహిస్తున్న అన్ని మార్కెట్లలోనూ ప్లాట్ఫామ్ ఫీజు పెంపు ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్లో చివరిగా జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఒక్కో ఆర్డర్కు రూ. 14.20 ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేస్తున్న మరో ఫుడ్ డెలివరీ సంస్థ మ్యాజిక్పిన్.. ప్రస్తుతానికి ఫీజు పెంపు ఉండదని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఫుడ్ డెలివరీ రంగం క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో, రెస్టారెంట్ భాగస్వాములకు మద్దతు ఇవ్వడానికి, వినియోగదారులకు ఫుడ్ డెలివరీని అందుబాటులో ఉంచడానికి ప్లాట్ఫామ్ ఫీజును పెంచకూడదని నిర్ణయించుకున్నామని మ్యాజిక్పిన్ సీఈవో అన్షూ శర్మ అన్నారు.
Also Read: Zomato Free Order: జొమాటోలో ఫ్రీ ఆర్డర్.. పౌష్టికాహారం కోసం రివార్డ్స్.. ఎలా చేయాలంటే?
జొమాటో ప్లాట్ఫామ్ ఫీజులలో పెంపు కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు ఫుడ్ ఆర్డర్స్ మరింత ఖరీదు కానున్నాయి. పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజులను పెంచింది. పెరిగిన ఇంధన ధరల వల్ల డెలివరీ కార్యకలాపాల ఖర్చు కూడా పెరుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ నెలకొంది. ఇప్పటి జొమాటో, స్విగ్గీ పోటీ పడుతుంది. తాజాగా క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో.. ఓన్లీ పేరిట బెంగళూరులో ఫుడ్ డెలివరీ సేవలు లాంచ్ చేసింది. డెలివరీ ఫీజు తప్ప కస్టమర్లు, రెస్టారెంట్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని ర్యాపిడో పేర్కొంది. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది.