Ganja Seizure: జనగామ జిల్లాలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. జిల్లాలోని బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి, సదరు బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోనే భారీగా దొరికిన గంజాయిని చూసి అధికారులు సైతం షాక్కి గురయ్యారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి ఎక్కడి నుండి తీసుకొచ్చారు? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఈ సరుకును ఎవరికి సరఫరా చేయాలనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగంపై నిఘాను మరింత ముమ్మరం చేశామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ దందాల గురించి సమాచారం ఇస్తే, వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Also Read: సీఎం అయితే కోట్ వేసుకోకూడదా? విమర్శకులకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!