Vizag container drugs: ఏపీలో ఎన్నికల వేళ వైజాగ్ కంటైనర్ డ్రగ్స్ వ్యవహారం ముదిరిపాకాన పడింది. దీనిపై రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.. చేరుకుంటోంది కూడా. నేతల విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా సీబీఐ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.కంటైనర్లోని ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ బేగుల నుంచి 49 నమూనాలను తీసుకుంది. వీటిని పరీక్షించగా, 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు సమాచారం.
ఓపీఎం, మార్ఫిన్, హెరాయిన్, మెస్కలిన్ ఉనికి ఉందా లేదా తెలుసుకునేందుకు 27 నమూనాలకు పరీక్షలు చేపట్టింది. వాటిలోనూ డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్నింటిలోనూ డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఎంత శాతం ఉన్నాయో అనేది ఇంకా తేలాల్సిఉంది. మరోవైపు సీబీఐ మాత్రం అన్ని కోణాల్లో ఆరా తీస్తోంది. అసలు డ్రగ్స్ కంటైనర్ని ఎలా గుర్తించారు? నేరుగా సీబీఐ రంగంలోకి దిగడం వెనుక కారణమేంటి?
ఇంకా లోతుల్లోకి వెళ్తే.. ఈనెల 18న ఇంటర్పోల్ నుంచి ఢిల్లీలోని సీబీఐ ఆఫీసు ఓ మెయిల్ వచ్చింది. బ్రెజిల్ నుంచి విశాఖకు నేరుగా డ్రగ్ కంటైనర్ వస్తోందని, దాన్ని తాము గుర్తించేలోపు పోర్టు నుంచి వెళ్లిపోయిందన్నది అందులో సారాంశం. దీని ఆధారంగా సీబీఐ రంగంలోకి దిగేసింది. ప్రత్యేక ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి మీ దగ్గరకు ఓ టీమ్ వస్తోందని, సహకారం కోసం కొంతమంది సిబ్బంది రెడీ చేయాలని విశాఖలోని సీబీఐ విభాగానికి సమాచారం ఇచ్చింది.
ఇక్కడా కూడా ట్విస్టులే. సీబీఐ టీమ్ ఢిల్లీ నుంచి నేరుగా బెంగుళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి విశాఖకు మరో విమానంలో వెళ్లింది. 19న ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాలకు విశాఖలో దిగింది సీబీఐ బృందం. తొలుత కస్టమ్స్ అధికారులను కలిసి తాము చేపట్టబోయే ఆపరేషన్ గురించి వివరించారు. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు. తమ ఆధీనంలోనే ఉందని కస్టమ్స్ అధికారులు చెప్పారు. దీంతో అక్కడి నుంచి నేరుగా కస్టమ్స్, సీబీఐ బృందాలు పోర్టుకు వెళ్లారు.
ముందుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి తాము ఎందుకు వచ్చామో వివరించారు. వెంటనే తనిఖీలు ముమ్మరం చేసింది. వెంటనే నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ను ఉఫయోగించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు బయటపడ్డాయి. వెంటనే సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది సీబీఐ. ఇదే సమయంలో అక్కడకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున రావడంతో పరీక్షల నిర్వహణ డిలే అయ్యింది. కంటైనర్ని వర్షానికి తడకుండా భద్రపరిచి సీల్ వేశారు.
మరుసటి రోజు ఉదయం మళ్లీ పరీక్షలు చేపట్టింది. అందులోన డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడంతో సంధ్య ఆక్వా ప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. ఓవరాల్గా 55 గంటలపాటు సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టి కంటైనర్ గుట్టును రట్టు చేసింది. సంధ్య ఆక్వా ప్రతినిధులపై కేసులు నమోదు కూడా జరిగిపోయింది.