Road Accidentతిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి సమీపంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు అక్కడ వైద్య సేవలు అందుతున్నాయి.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ తీవ్రమైన నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని వారు ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆగ్రహించిన ప్రయాణికులు, డ్రైవర్ నిర్లక్ష్యంపై మండిపడుతూ అతనిపై భౌతిక దాడికి దిగారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Also Read: భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో బస్సు ఎంత వేగంతో ఉంది? సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు డ్రైవర్ల పని గంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఈ సందర్భంగా పలువురు కోరుతున్నారు.