Bhupalpally district.జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగరిక సమాజం తలదించుకునేలా ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు, బాలికను లోబర్చుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా ప్రజల్లో ఆగ్రహావేశాలను నింపింది.
అయితే రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, బాలిక తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. చిన్నారి పరిస్థితిని చూసి హతాశులైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులపై కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
Also Read: కోకాపేట్లో ఆకాశాన్ని తాకుతున్న అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని వారు కోరుతున్నారు.