Abids ATM Firing: హైదరాబాద్ అబిడ్స్/కోఠి ఏటీఎం వద్ద జరిగిన సంచలన కాల్పుల దోపిడీ కేసులో తెలంగాణ పోలీసులు భారీ పురోగతి సాధించారు. కాల్పులు జరిపి పరారైన ఇద్దరు నిందితుల్లో ఒకరిని హర్యానాలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకోగా, మరో నిందితుడి కోసం ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ దుండగులకు హైదరాబాద్లో ఆశ్రయం కల్పించిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత నెల జనవరి 31న కోఠిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం వద్ద కేరళకు చెందిన వస్త్ర వ్యాపారి రిన్షాద్పై దుండగులు కాల్పులు జరిపారు. నాంపల్లిలో ఉంటూ వ్యాపారం చేసుకునే రిన్షాద్, ఆరు లక్షల రూపాయల నగదును ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్లగా, అక్కడ మాటువేసిన ఇద్దరు దుండగులు అతనిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాలికి బుల్లెట్ గాయంతో రిన్షాద్ కుప్పకూలగా, నగదు సంచి, అతని స్కూటీని తీసుకుని నిందితులు పరారయ్యారు.
ఈ కేసును సవాల్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు 800కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ ముఠా గత మూడు నెలలుగా ఈ దోపిడీ కోసం పకడ్బందీగా రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఘటన జరిగిన రోజు నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి నగరంలోనే పలు ఆటోలు మారుతూ తిరిగారని, కాచిగూడ వద్ద స్కూటీని వదిలేసి వేషం మార్చుకుని పారిపోయారని దర్యాప్తులో వెల్లడైంది. పాతబస్తీలో షెల్టర్ తీసుకున్న నిందితులు, అక్కడి నుండి తప్పించుకుని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లారు. ప్రస్తుతం పట్టుబడిన నిందితుడిని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: Hyderabad Drug Bust:10 కేజీల గంజాయి స్వాధీనం.. అంతర్ రాష్ట్ర పెడ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు!