Hyderabad Drug Bust: ప్రత్యేకంగా కుట్టించుకున్న బనియన్లలో గంజాయి ప్యాకెట్లు దాచి పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చిన ఇద్దరు అంతర్ రాష్ట్ర పెడ్లర్లను అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10.32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ ఏసీపీ సుదర్శన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా కలిమెల గ్రామానికి చెందిన ఆషిష్ శిక్దర్ (60), అనంతపల్లి గ్రామ నివాసి భీమా జాలీ (34) మధ్య పరిచయం ఉంది. ఇద్దరు కలిసి తేలికగా డబ్బు సంపాదించేందుకు కొంతకాలంగా గంజాయి దందా మొదలు పెట్టారు. కలిమల గ్రామానికే చెందిన మౌని (40) నుంచి గంజాయి కొని హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నారు.
Also Read: Minister Ponguleti: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.. ఎక్కడంటే..?
పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు చిన్న చిన్న జేబులతో ప్రత్యేకంగా కుట్టించిన బనియన్లలో గంజాయి ప్యాకెట్లు కొని ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఎప్పటిలానే మౌని నుంచి10.32 కిలోల గంజాయి కొని బనియన్లలో దాచి పెట్టుకుని బస్సులో హైదరాబాద్ వచ్చారు. కాగా, అఫ్జల్ గంజ్ సీఐ రవి, డీఐ రవికిరణ్, ఎస్ఐలు నిరంజన్, సుభాష్ తోపాటు కానిస్టేబుళ్లు రవికాంత్, అర్జున్, నాగార్జునలు బస్ స్టేషన్ వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆషిష్, భీమాల కదలికలు అనుమానాస్పదంగా అనిపించటంతో వారిని ఆపి తనిఖీ చేయగా గంజాయి దొరికింది. ఈ క్రమంలో ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. పెడ్లర్లను పట్టుకున్న సిబ్బంది అందరికీ గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ త్వరలోనే రివార్డులు అందచేయనున్నట్టు ఏసీపీ సుదర్శన్ తెలిపారు.