Damodar Rajanarasimha: స్వేచ్ఛ బ్యరో: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీ మంత్రి హరీశ్రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు.‘అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు, బహుళ అంతస్తుల భవనాలు కాదు. హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు ఇచ్చి, స్లాబులు వేస్తే సరిపోదు’ అని మంత్రి పేర్కొన్నారు. హాస్పిటల్ అంటే పూర్తి స్థాయిలో భవనాలు ఉండాలని, వందల సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది, ఎక్విప్మెంట్ సహా అన్నిరకాల సదుపాయాలు ఉంటేనే వైద్యం అందించగలుగుతామని మంత్రి వివరించారు. కానీ,బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు లబ్ది పొందడానికి అడ్డగోలుగు జీవోలు ఇచ్చిందని మండిపడ్డారు. టీచింగ్ ఫాకల్టీ, సరియైన వసతులు, సిబ్బంది, భవనాలు లేకుండా మెడికల్ కాలేజీలు పెట్టారని మంత్రి దామోదర ఫైర్ అయ్యారు. హాస్పిటళ్ల అప్గ్రేడెషన్ అంటూ అక్కడ కొంత, ఇక్కడ కొంత గందరగోళం చేసి ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్నారు. పదేండ్ల పాలనలో దెబ్బతిన్న ప్రజారోగ్య వ్యవస్థను తాము చక్కదిద్దుతున్నామని మంత్రి వివరించారు.
రెండు సంవత్సరాల్లో సుమారు 10 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, సుమారు మరో 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియను మరో 4 నెలల్లో పూర్తి చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు.ప్రతి హాస్పిటల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రతి హాస్పిటల్ను ఆధునీకరిస్తూ, పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్సీడీ క్లినిక్స్, డే కేర్ కేన్సర్ సెంటర్లు, మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. డయాలసిస్ సెంటర్ల సంఖ్య పెంచుతున్నామన్నారు. ట్రామా కేర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా అప్గ్రేడ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 10 లక్షలకు పెంచామన్నారు. ఇలా పదేండ్లలో బీఆర్ ఎస్ చేయలేని అనేక మంచి పనులను తాము కేవలం రెండేండ్లలో చేసి చూపించామన్నారు. ఇంకా ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని మంత్రి వివరించారు.
వాస్తవానికి తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదని మంత్రి వెల్లడించారు. హాస్పిటల్ బిల్డింగ్ కోడ్ను ఉల్లంఘించి, కేవలం ప్రచార ఆర్భాటం కోసం 24 అంతస్తుల స్లాబులు వేశారని విమర్శించారు. తొలుత 16.5 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఆ తర్వాత 21.3 లక్షల ఎస్ఎఫ్టీకి హాస్పిటల్ విస్తీర్ణాన్ని పెంచారన్నారు. బిల్డింగ్ ప్లానులో 3 నెలలకోసారి మార్పు చేస్తూ వచ్చారన్నారు. కట్టడం, కూల్చడమే పనిగా పెట్టుకుని.. నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ పోయారని మంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హాస్పిటల్ ఏర్పాటుకు 2021లో,2022 జూన్ వరకూ పనులే మొదలు పెట్టలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా పలుమార్లు రివ్యులు చేశారన్నారు.
అడ్డగోలుగా, అశాస్త్రీయంగా పెంచిన నిర్మాణ వ్యయాన్ని తగ్గించి 300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవకుండా చర్యలు తీసుకున్నారన్నారు. హాస్పిటల్కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయించి, త్వరలో హాస్పిటల్ను ప్రారంభించబోతున్నామన్నారు. మొత్తం 35 డిపార్ట్మెంట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నామన్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కేన్సర్ పేషెంట్లకు చికిత్స అందించే విధంగా అత్యాధునిక లైనక్, రేడియాలజీ సేవల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హిమోఫిలియా, సికిల్సెల్ ఎనిమియా, తలసేమియా వంటి బ్లడ్ డిజార్డర్స్కు చికిత్స అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించబోతున్నామన్నారు. .వ్యక్తిగత విమర్శలు మానుకుని, అభివృద్ధికి సహకరించాలని హరీశ్రావు కి మంత్రి విజ్ఞప్తి చేశారు.