Alluri Bus Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, పలువురికి గాయపడిన సంగతి తెలిసిందే. చింతూరు-మారేడుమల్లి ఘాట్రోడ్డులో ప్రమాద స్థలిని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పరిశీలించారు. అనంతరం చింతూరు ఏరియా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు.
అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమన్నారు. ఈ కష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఇస్తున్నామని ప్రకటించింది. బస్సు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో శుక్రవారం తెల్లవారు జామున ప్రైవేట్ బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను అధికారులు ప్రకటించారు.
శివశంకర్ రెడ్డి, శ్రీ కళా, సునందా, ఉమారెడ్డి, కృష్ణ కుమారి, రఘరా మధు, పొంగుల ప్రసాద్, మరో 2 మృతదేహాలు గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Also Read: Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా.. స్పాట్లోనే 8 మంది మృతి