Germany Telangana Relations: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు జర్మనీ ఆసక్తి కనబరుస్తోంది. శుక్రవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో జర్మనీ పార్లమెంటు బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి.
జర్మనీతో భారత్కు సుదీర్ఘ స్నేహబంధం ఉందని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం భట్టి.. తెలంగాణలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా జర్మనీకి పట్టున్న మెటలర్జీ, ఆటోమొబైల్ రంగాల్లో సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’, మూసీ పునర్జీవన ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. అలాగే, త్వరలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీలో జర్మన్ భాషా విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడి యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని, ఆర్థిక నేరాలను అరికట్టేందుకు ఏఐ (AI) టూల్స్ వాడుతున్నామని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్పై జర్మనీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. రాష్ట్ర ప్రగతికి సంబంధించి లక్ష్యాలపై ప్రభుత్వం స్పష్టతతో ఉందని కొనియాడింది. ఇప్పటికే బాష్ (Bosch) వంటి జర్మన్ సంస్థలు తెలంగాణలో పనిచేస్తున్నాయని, దాదాపు 60 వేల మంది భారతీయ విద్యార్థులు జర్మనీలో చదువుతున్నారని బృందం సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో జర్మన్ ఎంపీలు జోసెఫ్ ఆస్టర్, డేనియల్ కోల్బ్, టిజెన్ అటావోగ్లు తదితరులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.