Bus Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. కుటుంబ సభ్యులు కలసి భద్రాచలంలో దర్శనం ముగించుకుని అన్నవరం వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అల్లూరిలో బస్సు ప్రమాదంతో చింతూరు- మారేడుమిల్లి మధ్య పలు వాహనాలు నిలిచిపోయాయి.. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ప్రమాదం జరిగిన బస్సు నెంబర్: AP 39 UM 6543
బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరగడం బాధాకరం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.