Headmaster Attack On Students: అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుంది. పాఠ శాల అంటే విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే దేవాలయం కావాలి.. కానీ క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకురావడం తీవ్రమైన విషయం.
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ హైస్కూల్లో దారుణం జరిగింది. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని.. రుచిగా ఉండటం లేదని తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు గిరిజన విద్యార్థులు ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించి.. మెరుగైన భోజనం అందించాల్సిన బాధ్యతను విస్మరించిన హెడ్మాస్టర్ (HM) కె. హేమచందర్ వారిపై అమానుషంగా ప్రవర్తించారు.
తమను ప్రశ్నిస్తారా అన్న ఆగ్రహంతో హెచ్ఎం ఆ ఇద్దరు విద్యార్థులను కర్రతో చితకబాదారు. హెచ్ఎం కొట్టిన దెబ్బలకు తాళలేక.. ఒక విద్యార్థికి తీవ్రమైన భయాందోళనతో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మరో విద్యార్థి కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. తోటి విద్యార్థులు , సిబ్బంది వెంటనే స్పందించి.. బాధితులను హుటాహుటిన దారకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ‘మా పిల్లలు అడిగింది కేవలం నాణ్యమైన భోజనం మాత్రమే.. దానికి ఇంతటి శిక్ష వేస్తారా?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. గిరిజన విద్యార్థుల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి… బాధ్యులను సర్వీసు నుండి తొలగించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
Also Read: నాంపల్లి FSLలో భారీ అగ్నిప్రమాదం.. క్లూస్ టీమ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?