Anankapalli Crime: బీమా డబ్బులు కోసం సొంత మామనే హత్య చేసిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. మామను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అల్లుడు, మనవడు ప్రయత్నించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా డీఎస్సీ శ్రావణి శనివారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కొత్తపల్లిలో ఈనెల 9న కుర్రు నారాయణమూర్తి(54) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు సమాచారం వచ్చింది. నారాయణ మూర్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. గాయాలను చూసి హత్యగా అనుమానించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో నారాయణమూర్తి పేరు మీద ఇటీవల వివిధ కంపెనీల్లో రూ.1.08 కోట్లకు బీమా పాలసీలు తీసుకున్నట్టు గుర్తించారు. మామ చనిపోతే ఇన్సూరెన్స్ సొమ్ము తమకు వస్తుందని భావించిన అల్లుడు సుంకరి అన్నవరం, మనవడు సుంకరి జ్యోతి ప్రసాద్ మర్డర్ ప్లాన్ చేశారు. నారాయణమూర్తి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఎల్ఐసీ ఏజెంట్, హత్యలో పాల్గొన్న అగ్రహారపు తాతాజీలను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడైన అన్నవరం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి, ఆ అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో మామ నారాయణమూర్తి పేరుమీద అనేక ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు. ఆ తర్వాత అతడిని హత్య చేసి, ఆ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలని పథకం వేసినట్లు డీఎస్పీ తెలిపారు.
నారాయణమూర్తిని పథకం ప్రకారం ఒంటరిగా తీసుకెళ్లి దాడి చేసి తీవ్ర గాయాలు చేశారు. అనంతరం అతడిని మోటార్ సైకిల్ను రోడ్డుపై ఉంచి, తెలియని వాహనం ఢీకొట్టినట్లు ప్రమాదంగా చూపిస్తూ కుటుంబ సభ్యులు, ఇతరులను తప్పుదారి పట్టించారు. ఈ విధంగా హత్యను ప్రమాదంగా మలచి ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలనే ప్రయత్నం చేశారు.
Also Read: Medak Crime: అయ్యో పాపం.. ఎంత పని చేశావ్ దేవుడా…? రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్డెడ్
శవ పంచనామా, పోస్ట్మార్టం అనంతరం చనిపోయిన వ్యక్తి శరీరంపై గాయాలు, కుటుంబ సభ్యులు కదలికపై పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణలో నిందితుల కుట్ర వెలుగులోకి వచ్చింది. కేసును తొందరగా ఛేదించిన కసింకోట పోలీసులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ శ్రావణి అభినందించారు.