Road Accident: అనంతపురం జిల్లా పామిడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. KA 50 A 6653 నెంబర్ గల కారు ఈ ప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తూ బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. పామిడి సమీపంలో జాతీయ రహదారిపై ముందుగా ఆగి ఉన్న వాహనాన్ని గమనించని కారు డ్రైవర్, అధిక వేగంతో వెనుక నుంచి ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఢీ కొట్టిన వెంటనే కారు పూర్తిగా ధ్వంసమవ్వగా, ప్రయాణికులు వాహనంలోనే ఇరుక్కుపోయారు.
సమాచారె తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. ధ్వంసమైన కారును రహదారి నుంచి తొలగించిన అనంతరం ట్రాఫిక్ను క్రమంగా పునరుద్ధరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, వంటి అంశాలపై విచారణ జరుపుతున్నారు.
Also Read: విషాదం.. రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం.