Anantapur: అనంతపురం జిల్లాలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నమ్మి డబ్బులు పెట్టిన జనాలను ముంచేసి, ఒక కేటుగాడు ఏకంగా 25 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దొంగల నరేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఘరానా మోసానికి తెరలేపాడు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మబలికిన నరేష్ రెడ్డి, బయటి వారి కంటే ఎక్కువగా తన సొంత బంధువులు, స్నేహితులనే టార్గెట్ చేయడం గమనార్హం.
మొదట్లో నమ్మకం కుదరడం కోసం ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై నెలకు మూడు రూపాయల వడ్డీ (3% వడ్డీ) చొప్పున క్రమంగా చెల్లించాడు. దీంతో ఆశపడ్డ బాధితులు, వచ్చిన లాభాలను కూడా తిరిగి అక్కడే పెట్టుబడిగా పెట్టారు. ఇలా దాదాపు వంద మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయిల చొప్పున వసూలు చేశాడు.
తీరా అసలు డబ్బులు అడిగేసరికి నరేష్ రెడ్డి ముఖం చాటేశాడు. బాధితులు గట్టిగా నిలదీయడంతో రాత్రికి రాత్రే కనిపించకుండా పోయాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు తాజాగా అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read: ఢిల్లీ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి