Anantapur Crime News: అనంతపురం జిల్లాలో అత్యంత దిగ్భ్రాంతికరమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి పెరట్లోనే పాతిపెట్టిన ఒక భార్య ఉదంతం కల్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో సంచలనం సృష్టిస్తోంది. సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘోరం, తాజాగా తల్లి కూతుళ్ల మధ్య జరిగిన గొడవతో బయటపడటం గమనార్హం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పాత చెరువు గ్రామానికి చెందిన బోయ హనుమంతు, సుకన్య దంపతులు. హనుమంతు గొర్రెల కాపరిగా పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం సుకన్య తన భర్తను తలకాయపై బండరాయితో కొట్టి అత్యంత క్రూరంగా హతమార్చింది. అనంతరం ఎవరికీ తెలియకుండా ఇంటి వెనుక భాగంలో గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. హనుమంతు వృత్తిరీత్యా గొర్రెల కాపరి కావడంతో, అతను గొర్రెలను కాసేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాడని, అక్కడే ఎవరినో మహిళను తీసుకుని కర్ణాటకకు పారిపోయాడని సుకన్య గ్రామంలో నమ్మబలికింది. దీంతో బంధువులు కూడా అతను ఎక్కడికో వెళ్ళిపోయాడని భావించి సుకన్య మాటలను నమ్మారు.
ఈ హత్య జరిగిన సమయంలో సుకన్య కూతురు అమృత (ఇంటర్ విద్యార్థిని)కి విషయం తెలుసు. కొడుకు సందీప్ గొర్రెలను కాసేందుకు బయట ఉండటంతో అతనికి విషయం తెలియదు. అయితే, పండగ కోసం ఇంటికి వచ్చిన సందీప్ తన తండ్రి గురించి ఆరా తీయగా, అక్క అమృత అసలు నిజాన్ని బయటపెట్టింది. తల్లి తండ్రిని చంపి ఇంటి వెనుకే పాతిపెట్టిన విషయాన్ని సోదరుడికి, తాతకు వివరించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో, తన ప్రాణాలకు ముప్పు ఉందని భయపడిన సుకన్య వెంటనే కల్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తన భర్తను తానే చంపి పూడ్చిపెట్టినట్లు నేరాన్ని అంగీకరించింది.
ఈ హత్య వెనుక సుకన్యకు వేరొకరితో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక ఒంటరి మహిళ అంతటి గుంత తీసి మృతదేహాన్ని పాతిపెట్టడం అసాధ్యమని, దీని వెనుక ఖచ్చితంగా మరొకరి సహాయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సహకరించిన వారు ఎవరు? ఏ కారణంతో హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రేపు ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
Read Also: Indore Infosys Techie Killed: పార్కింగ్ ఏరియాలో కారుతో గుద్ది.. మహిళా టెక్కి ప్రాణాలు తీసిన ఉన్మాది!