Army Officer Kills Daughter| కేవలం తన మాట వినలేదనే కోపంతో ఒక కన్నతండ్రి తన కూతురిని తుపాకీతో కాల్చి చంపాడు. సంతోషంగా కాపురుం చేసుకుంటున్న కూతురు అల్లుడిపై నలుగురు చూస్తుండగానే ఆ తండ్రి కాల్పులు జరిపాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లోని జలగావ్ నగరంలో నివసించే రిటైర్డ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) ఆఫీసర్ కిరణ్ మాంగ్లే (50) నాలుగు రోజుల క్రితం తన కొడుకు నిఖిల్ మాంగ్లేతో కలిసి సమీప పట్టణమైన చోప్డా తెహ్సీల్ లో జరుగుతున్న పెళ్లికి వెళ్లాడు. అయితే ఆ పెళ్లికి వారిద్దరూ అతిథులుగా వెళ్లలేదు. ఆ పెళ్లిలో ఉన్న తన కూతురు, అల్లుడిని చంపేయాలనే ఉద్దేశంతో వెళ్లాడు కిరణ్ మాంగ్లే. అందుకే తన వెంట లైసెన్స్డ్ రివాల్వర్ వెంటబెట్టుకొని వెళ్లాడు. అక్కడ హల్దీ వేడుక జరుగుతుండగా ఎంతో సంతోషంగా ఉన్న తన కూతురు త్రిప్తి మాంగ్లే (24), అల్లుడు అవినాష్ వాఘ్ పై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో త్రిప్తి మాంగ్లే అక్కడే చనిపోగా.. ఆమె భర్త అవినాష్ బుల్లెట్ గాయాల కారణంగా కుప్పకూలాడు.
దీంతో అవినాష్ ను చికిత్స కోసం ఆయన బంధువులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అవినాష్ పుణె లో సాసూన్ జెనెరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మరోవైపు కాల్పులు జరిపిన కిరణ్ మాంగ్లేని పెళ్లిలో బంధువులు చితకబాదారు. దీంతో ఆయన శ్వాస సంబంధిత సమస్యలో వెంటిలేటర్ పై ఉన్నాడు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి కిరణ్ మాంగ్లే, ఆయన కుమారుడు నిఖిల్ మాంగ్లేపై కేసు నమోదు చేశారు. అవినాష్ వాఘ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్ మాంగ్లేని అరెస్ట్ చేశారు.
పోలీసులు కథనం ప్రకారం.. సిఆర్పిఎఫ్ ఆఫీసర్ అయిన కిరణ్ మాంగ్లేకి ఇద్దరు సంతానం. ఒకరు త్రిప్తి మాంగ్లే (24), రెండు నిఖిల్ మాంగ్లే (21). త్రిప్తి మాంగ్లే బాగా చదువుకొని ఎంబిబిఎస్ పూర్తి చేసింది. దీంతో ఆమెను ఒక డాక్టర్ కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి కిరణ్ మాంగ్లే భావించాడు. కానీ విధి మరొకటి తలచింది. ఆయన కూతురు త్రిప్తి మరో యువకుడిని ప్రేమించింది. అతడే అవినాష్ వాఘ్. అవినాష్ పెద్దగా చదువుకోలేదు. ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు. కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా ఏదో లేబర్ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే కాలేజీ సమయం నుంచే అవినాష్, త్రిప్తి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అవినాష్ కష్టాలు తెలిసి కూడా త్రిప్తి అతడిని నిజాయితీగా ప్రేమించింది.
Also Read: భారత సరిహద్దుల్లో పాక్ సైనికుడు.. ఇండియన్ జవాన్పై వేటు
మరోవైపు వారి ప్రేమ గురించి తెలిసి కిరణ్ మాంగ్లే ఆగ్రహం చెందాడు. ఎంబిబిఎస్ చదివిన తన కూతురు ఏదో లేబర్ పని చేసుకొన బతికే వ్యక్తిని ప్రేమించడం తనకు ఇష్టం లేదని వారి బంధాన్ని స్వీకరించలేదు. అందుకే త్రిప్తి కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా.. త్రిప్తి తన ప్రియుడు అవినాష్ ని రిజిస్టర్ వివాహం చేసుకుంది. ఇదంతా 2023లో జరిగింది. త్రిప్తి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఒక లేబర్ యువకుడిని పెళ్లి చేసుకోవడాన్ని కిరణ్ మాంగ్లే జీర్ణించుకోలేకపోయాడు. తన కూతురు వల్ల తన పరువు పోయిందని లోలోపల రగిలిపోయాడు. అందుకే తన ఇంటికి తన కూతురు రాకూడదని చెప్పాడు. మరోవైపు అవినాష్, త్రిప్తి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండగా.. ఇటీవల అవినాష్ చెల్లెలి పెళ్లి నిశ్చయమైంది.
ఆ పెళ్లి గురించి తెలుసుకున్న త్రిప్తి సోదరుడు నిఖిల్ మాంగ్లే తమ పరువు తీసిన అవినాష్ కు బుద్ధి చెప్పాలని భావించాడు. అందుకే ఇంట్లో ఉన్న తన తండ్రి రివాల్వర్ ని తీసుకొని అవినాష్ ని చంపేయాలనుకున్నాడు. కానీ తుపాకీ తీసే సమయంలో కిరణ్ మాంగ్లే చూసి అడ్డుపడ్డాడు. ఆ తరువాత తన కొడుకు ద్వారా అవినాష్ చెల్లెలు పెళ్లి చేసుకుంటోందని తెలిసి తమ పరువు తీసిన అవినాష్ ని అతడి కుటుంబాన్ని కాల్చి చంపేయాలనుకున్నాడు. అందుకే ఆ రివాల్వర్ తీసుకొని తన కొడుకుతో పాటు పెళ్లికి వెళ్లి.. తన అల్లుడు అవినాష్ పై కాల్పులు జరిపాడు. కానీ అతని కూతురు త్రిప్తి అడ్డు రావడంతో ఆ బుల్లెట్లు ఆమెకు కూడా తగిలాయి. కిరణ్ మాంగ్లే కాల్పులు జరపడం చూసి ఆ పెళ్లిలోని కొంతమంది యువకులు రివాల్వర్ లాగేసుకున్నారు. ఆ తరువాత కిరణ్ మాంగ్లే, ఆయన కొడుకు నిఖిల్ మాంగ్లేని చితకబాదారు. కానీ నిఖిల్ మాంగ్లే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు.