Jodhpur Crime: రాజస్థాన్లోని జోధ్పూర్లో అత్యంత అమానవీయ, హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి కావడం లేదనే మూఢ నమ్మకంతో.. కుటుంబంలో నెలకొన్న ‘దోషాన్ని’ తొలగించుకోవాలనే ఉద్దేశంతో నలుగురు మహిళలు కలసి 16 రోజుల పసికందును అత్యంత దారుణంగా కాళ్లతో తొక్కి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మంత్రాలు చదువుతూ.. పూనకంతో ఊగిపోతూ ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మృతుడు ఈ నలుగురు మహిళలకు మేనల్లుడే కావడం ఈ ఘటనలోని విషాదం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నలుగురు మహిళలకు చాలా కాలంగా వివాహాలు కావడం లేదు. తమ కుటుంబంలో ఏదో దోషం ఉందని, అందుకే పెళ్లిళ్లు జరగడం లేదని వారు బలంగా నమ్మారు. ఈ దోషాన్ని తొలగించుకోవడానికి తాము కొన్ని క్షుద్రపూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. కేవలం 16 రోజుల క్రితం జన్మించిన తమ మేనల్లుడిని బలి ఇవ్వాలని వారు భావించారు.
ఘటన జరిగిన రోజున, నలుగురు మహిళలు ఒక గదిలో సమావేశమై మంత్రాలు చదవడం ప్రారంభించారు. పూనకంతో ఊగిపోతూ.. తమ చేతుల్లో ఉన్న పసికందును నేలపై పడేసి, కాళ్లతో దారుణంగా తొక్కేశారు. ఆ చిన్నారి కేకలు విని ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. వారు ఆపకుండా తమ క్రూరత్వాన్ని కొనసాగించారు. శిశువును తొక్కేసి, ప్రాణం పోయే వరకు వారు పూనకంతో ఊగిపోతూనే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పసికందు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బిడ్డను దారుణంగా చంపిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి మానసిక స్థితిపై, క్షుద్రపూజల నేపత్యంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మూఢ నమ్మకాల కారణంగా ఒక నిండు ప్రాణం బలైన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడిన నిందితులకు త్వరితగతిన న్యాయస్థానం కఠిన శిక్ష విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ALSO READ: GlobeTrotter Event : మహేష్ బాబు ఎమోషనల్, నాన్నగారు చెప్పిన పని చేయలేదు