Hyderabad: తెలంగాణలో సంచలనం రేపింది బండి భగీరథ్ కేసు వ్యవహారం. పోక్సో కేసులో శనివారం రాత్రి ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి ముందు నిందితుడ్ని పోలీసులు హాజరు పరిచారు. నిందితుడికి రెండువారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నేరుగా అతడ్ని చర్లపల్లి జైలుకి తరలించారు.
చర్లపల్లి జైలుకు సాయి భగీరథ్
శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బండి భగీరథ్ అరెస్టు వ్యవహారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపు తట్టారు. అక్కడ భగీరథ్కు ఉపశమనం లభించలేదు. ఈ నేపథ్యంలో శనివారం పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం, పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో రాత్రి 8 గంల సమయంలో బండి సంజయ్ నివాసానికి పోలీసులు వెళ్లడం, తాను కొడుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆయన ప్రకటన విడుదల చేశారు. కొద్దిసేపటికి భగీరథ్ను అరెస్టు చేశామని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు.
రెండు వారాలు జ్యుడిషియల్ కస్టడీ
ఈ కేసు పర్యవేక్షిస్తున్న డిసిపి రితిరాజ్ నిందితుడిని సుమారు రెండు గంటల పాటు విచారించారు. అక్కడి నుంచి భగీరథను మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా మేడ్చల్ జడ్జ్ నివాసానికి తరలించి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు పోలీసులు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడు సాయి భగీరథకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భారీ పోలీసు భద్రత మధ్య మేడ్చల్ నుంచి చర్లపల్లి జైలుకి నిందితుడు సాయి భగీరథుని తరలించారు. ఈ నెల 29 వరకు సాయి భగీరథ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నారు. మరోవైపు భగీరథ్ను కస్టడీనికి తీసుకుని విచారించాలని సిట్ భావిస్తోంది. సోమవారం కస్టడీ పిటిషన్ వేయాలని భావిస్తున్నారు పోలీసులు.
ALSO READ: థాయ్లాండ్లో ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలు-బస్సు ఢీకొని 8 మంది మృతి, మరో 20 మందికి గాయాలు