రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎన్నడూ లేని విధంగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, సీఎం ఎవరి శాఖల్లో జోక్యం చేసుకోకుండా స్వేచ్ఛనిస్తున్నారని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీలకు భవిష్యత్తు లేదు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గతమే తప్ప, దానికి భవిష్యత్తు లేదని మహేష్ గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై తాము ఎన్నికలకు ముందు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు రుజువు అవుతున్నాయన్నారు. అలాగే, బీజేపీకి కూడా రాష్ట్రంలో ఆదరణ లేదని.. కేవలం ఎన్నికల సమయంలోనే దేవుళ్లను రాజకీయాల్లోకి తెచ్చి లబ్ధి పొందాలని ఆ పార్టీ చూస్తుందని మండిపడ్డారు. ‘మేము కూడా హిందువులమే, కానీ రాజకీయాల్లో దేవుళ్లను వాడుకోము. శ్రీరాముడు కేవలం బీజేపీకి మాత్రమే దేవుడు కాదు’ అని ఆయన స్పష్టం చేశారు.
శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన
గత ప్రభుత్వంలో కేసీఆర్ తన కుటుంబ సభ్యుల (కొడుకు, బిడ్డ, అల్లుడు) ప్రయోజనాల కోసమే జిల్లాల విభజన చేశారని మహేష్ గౌడ్ ఆరోపించారు. అశాస్త్రీయంగా జరిగిన ఈ విభజన వల్ల ఒకే మండలంలోని గ్రామాలు వేర్వేరు జిల్లాల్లో పడ్డాయని, దీనిపై ఒక కమిటీ వేసి శాస్త్రీయంగా పునర్విభజన చేస్తామని ప్రకటించారు. అయితే, జిల్లాల పేర్లు మార్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికలు – పార్టీలో సమన్వయం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90 శాతం స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి కొత్తగా చేరిన 10 నియోజకవర్గాల నేతల విషయంలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. పాత నాయకులను గౌరవిస్తూనే, కొత్త వారిని కలుపుకుని పోతామని, గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తుపై పీఏసీ (PAC) సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ లోపు కార్పొరేషన్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, అంతా సమిష్టిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: Municipal Elections 2026: మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా.. ఓటర్ల లెక్క తేలింది.. మహిళలదే పైచేయి..!