Bengaluru Techie: టెక్ యుగంలో ఎప్పుడు.. ఎలాంటి.. ఉపద్రవం ముంచుకొస్తుందో తెలీదు. దీన్ని తమకు అనుకూలంగా మలచుకుని రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నా.. దీన్ని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజగా బెంగళూరుకు చెందిన ఓ మహిళా టెక్కీ డిజిటల్ అరెస్ట్ ట్రాప్లో పడింది. అందుకోసం రెండు కోట్ల విలువైన ఆస్తులను అమ్ముకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగుళూరులో అడ్డంగా బుక్కైన టెక్కీ
టెక్ యుగంలో అరచేతిలో మొబైల్ లేనివారు హ్యాపీ. ఉన్నవారికి మాత్రం క్షణం క్షణం టెన్షన్లు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్లు తారాస్థాయికి చేరాయి. ఈ యవ్వారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటే.. దేశంలో పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. వీటిని అదుపు చేసేందుకు టెలికాం ఆపరేటర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా చాలామంది దీని బారినపడి కోట్లాది రూపాయలు పొగొట్టుకుని రోడ్డు మీద పడుతున్నారు.
లేటెస్ట్గా బెంగళూరు సిటీకి చెందిన ఓ టెక్కీ.. డిజిటల్ అరెస్టు ట్రాప్లో పడింది. అందుకోసం కూడబెట్టిన ఆస్తులను అమ్ముకునే పరిస్థితి చేరింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా వీధిలో పడింది. బెంగళూరు సిటీలోని విజ్ఞాన్నగర్ ప్రాంతంలో 10 ఏళ్ల కొడుకుతో నివాసం ఉంటోంది టెక్కీ బబితా దాస్. ఆ మహిళ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తోంది.
డిజిటల్ అరెస్టుతో ఆస్తిని అమ్మేసి, రోడ్డు మీద పడింది
జూన్లో ఓ వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. తాను కొరియర్ అధికారి అని చెప్పి ఆమెని నమ్మించాడు. మీ పేరుతో ఆధార్ కార్డుకు సంబంధించిన అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నామని నమ్మించాడు. నిజమేనని నమ్మి భయపడిపోయింది ఆ టెక్కీ.
ఫేక్ కొరియర్ అధికారి.. ఆ కాల్ని తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకున్న మరో వ్యక్తికి బదిలీ చేశాడు. మీ సామాన్లకు సంబంధించి ప్రాసెస్ జరుగుతోందని, ధృవీకరణ పూర్తయ్యే వరకు బయటకు వెళ్లకూడదని టెక్కీని భయపెట్టాడు. లేకుంటే అరెస్టు చేస్తామని బెదిరించాడు.
ఈ క్రమంలో ఆమె నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేశాడు. ఫలానా మొబైల్ అప్లికేషన్ను తన ఫోన్లో ఇన్స్టాల్ చేయాలని బెదిరించారు. చేయకంటే నీ కొడుకు విషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించాడు. కొడుకు భవిష్యత్తు గురించి భయపడి, వారి సూచనలను పాటించింది.
ALSO READ: నిజామాబాద్లో కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్ని చంపి పరార్
ఈ క్రమంలో మలూర్లోని రెండు ప్లాట్లను తక్కువ ధరలకు అమ్మేసింది. ఆ తర్వాత విజ్ఞాన్ నగర్లో ఫ్లాట్ను కూడా అమ్మేసింది. వాటి ద్వారా వచ్చిన డబ్బును మోసగాళ్ల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. దీనికితోడు బ్యాంకు నుండి కొంత అప్పు తీసుకుని అది కూడా చెల్లించింది.
డబ్బును తమ ఖాతాలోకి ట్రాన్సుఫర్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు.. సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించమని చెప్పి కాల్ కట్ చేశారు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గమనించిన ఆ టెక్కీ, వైట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.