Pani Puri Incident: పానీపూరీ.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. పిల్లలు అతి ఇష్టపడే ఆహారంలో ఇది కూడా ఒకటి. పానీపూరీపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. రోడ్డు పక్కన పానీపూరి తిని ఓ బాలుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు మరో 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన జార్ఖండ్లో వెలుగు చూసింది.
జార్ఖండ్లో దారుణం.. పానీపూరీ తిని బాలుడు మృతి
జార్ఖండ్లోని గిరిడీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పానీ పూరీ తీసుకున్న తర్వాత ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో 18 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బజ్టో గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ఇంటింటికీ తిరిగి పానీపూరీ అమ్ముతాడు. ఆ రోజు చాలామంది చిన్నారులు పానీపూరీ కొనుగోలు చేశారు. వాటిని తిన్న చిన్నారులు రాత్రి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఆదివారం నాటికి చిన్నారుల పరిస్థితి క్షీణించింది.
ఆసుపత్రిలో మరో 18 మంది.. విచారణకు ఆదేశించిన అధికారులు
వెంటనే గ్రామస్థులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడు కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరో 18 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన సదరు పానీపూరీ వ్యాపారి పరారీలో ఉన్నాడు.
ALSO READ: లాకప్లో ఆత్మహత్యలకు చెక్.. ముంబై పోలీసుల కొత్త డ్రెస్ కోడ్!
ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్ తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది పరిస్థితి నిలకడగా ఉందన్నారు. చిన్నారులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు.
ఆహార విష ప్రయోగం జరిగిందని అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పానీపూరీపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అందులో కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు కర్ణాటకలో ప్రచారం సాగింది. ఆపై వైద్య అధికారులు సోదాలు చేసిన విషయం తెల్సిందే.