Thrissur Pooram: కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. అందరిని ఏకం చేసి వాయిద్యాల చప్పుళ్లతో అందరిని స్టెప్పులు వేయిస్తుంది త్రిస్సూర్ పురం. ఇక్కడ చిన్న పిల్లలైనా.. పెద్దవారైనా.. ఆడవారైనా.. మగవారైనా.. ఏ తారతమ్యం అనేది లేకుండా అందరిని ఏకం చేస్తూ.. వారిని మనసులను ఉత్తేజపరుస్తుంది త్రిస్సూర్పూరం.
అద్భుతంగా అలంకరించినన ఏనుగులు.. వీనుల విందైన సంగీతం.. ఉత్సాహభరితంగా ప్రదర్శించే పెద్ద పెద్ద గొడుగులు.. అన్నింటికంటే హైలేట్.. ముగింపులో బాణాసంచా ప్రదర్శన.. త్రిస్సూర్ ఫెస్టివల్ హైలేట్స్ ఇవే. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. వేలాది భక్తుల హర్షధ్వానాల మధ్య శివకుమార్ అనే ఏనుగు ఆలయ దక్షిణ ద్వారాన్ని తెరవడంతో ఈ వేడుక ప్రారంభమైంది. తర్వాత నీతిలక్కవిళమ్మ విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.. దీనిని పూర విలంబరం అంటారు.
దైవత్వం.. సాంప్రదాయం.. అంతులేని ఎనర్జీ.. వీటన్నింటిని మిక్స్ చేస్తే త్రిస్సూర్ పూరం వేడుక. అందుకే కేరళంలో దీనిని మదర్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్గా పిలుస్తారు. ఈ పండగ ఎంత ప్రత్యేకమైనది అనేది తెలియాలంటే దీనిని చూడటానికి తరలివచ్చే ప్రజలను చూస్తే అర్థమవుతోంది. లక్షలాది మంది త్రిస్సూర్కు తరలివస్తారు. 36 గంటలపాటు తెక్కింకాడు మైదానంలో కన్నుల పండుగా నిర్వహిస్తారు ఈ వేడుకను. త్రిసూర్ పూరం అనేది కేరళ వ్యాప్తంగా ఉన్న 10 ఆలయాలకు చెందిన దేవతల సమావేశం గురించింది అని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడు తిరువాంబడి, పరమెక్కావు ఆలయాలు మాత్రమే ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
నిజానికి 36 గంటల పాటు అనుకుంటాం కానీ.. ఇది వారం రోజుల పాటు జరిగే వేడుక. ఏప్రిల్ 20న జెండా ఎగురవేయడంతో ఈ పండగ ప్రారంభమైంది. దీనిని కొడియేట్టం అంటారు. కానీ అసలైన పండగ మాత్రం ఆదివారం రోజే ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు గజమేళా, కుడమాట్టం వేడుక ఉంటుంది. అందుకే ఈ రోజు లక్షలాది మంది తరలివస్తారు.
కణిమంగళం శాస్తా.. అంటే పూరం రోజున తెల్లవారుజామున మొదటి ఆలయ ఊరేగింపు.. వడక్కుమ్నాథన్ ఆలయానికి చేరుకోవడంతో వేడుక కొత్త టర్న్ తీసుకుంటుంది అనే చెప్పాలి. త్రిస్సూర్ సరికొత్తగా కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం ఇలంజిత్తల్ మేళం వేడుక అయితే చూపు తిప్పుకోనివ్వదు. ఆలయ ప్రాంగణంలో భారీగా వాయిద్య ప్రదర్శన జరుగుతోంది. ఆ వాయిద్యాలు చేసే చప్పుళ్లకు అనుగుణం చేసే డ్యాన్స్లను చూసేందుకు రెండు కళ్లు చాలవునే చెప్పాలి. ఎటు చూసిన జనమే కనిపిస్తున్నా… రిథమ్ మాత్రం మిస్ అవ్వదు.
ఇక సాయంత్రం జరిగే కుడమాట్టం మరో హైలేట్. రంగురంగుల గొడుగుల మార్పిడి వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. బంగారు ఏనుగు అలంకరణ, నెమలి ఈకలతో చేసిన విసనకర్ర, రాజ విసనకర్ర, పవిత్ర గంటలు, అలంకార గొడుగులు చూసేందుకుకు త్రిస్సూర్కు వెళ్లాల్సిదే.
మలయాళ క్యాలెండర్ ప్రకారం మేడం మాసంలో పూరం నక్షత్రం వచ్చిన రోజు.. ఈ పండుగ జరుపుకుంటారు. త్రిస్సూర్లోని వడక్కుమ్నాథన్ ఆలయంలో దీనిని నిర్వహిస్తారు. శివుడిని.. ఇక్కడి ప్రజలు వడక్కున్నాతన్ అని కొలుస్తారు. పదిలక్షల మందికి పైగా భక్తులు.. ఈ ఉత్సవానికి తరలివస్తారంటే అర్థం చేసుకోవచ్చు దీని వైభవం, ప్రాశస్త్యం. నిజానికి ఈ టైమ్లో కేరళంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఇక ఉక్కపోత అయితే భరించలేం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇవేవీ కూడా ప్రజలను ఆపవు.
త్రిస్సూర్ పూరం వేడుకకు రెండు శతాబ్ధాలకుపైగా చరిత్ర ఉంది. 1796 తర్వాత నుంచి ఈ వేడుకను ప్రతి ఏడాది జరుపుకుంటున్నారు. ఒకప్పుడు త్రిస్సూర్ జాల్లాలోని ఆలయాలన్నీ ఆరట్టుపుళ పూరంలో పాల్గొనేవి. ఓ ఏడాది భారీ వర్షాలు కురవడంతో కథ మారిపోయింది. భారీ వర్షాల కారణంగా వడక్కుమ్నాథన్ ఆలయ సిబ్బంది సమయానికి ఆరట్టుపుళకు చేరుకోలేకపోయింది. కారణమేంటో తెలుసుకోకుండా త్రిస్సూర్కు చెందిన బృందాన్ని వేడుకల నుంచి బహిష్కరించారు. దీన్ని అవమానంగా భావించారు వడక్కుమ్నాథన్ ఆలయ అధికారులు. అప్పుడే తమ ఆలయానికి ప్రత్యేకంగా పూరం జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. అయితే వీరితో మిగతా ఆలయాల అధికారులు కలిసిరాలేదు.. దాంతో ఈ పూరం ఎక్కవకాలం నిలువలేకపోయింది. 18వ శతాబ్దం ఆరంభంలో కొచ్చిన్ రాజవంశానికి చెందిన శ్రీరామవర్మ పాలన ప్రారంభమయ్యింది.త్రిస్సూర్ పూరం గురించి తెలుసుకున్న ఆయన తిరిగి ఆ పండుగను నిర్వహించడానికి పూనుకున్నారు. అలా త్రిస్సూర్పూరం తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుంచి రెండు వందల సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది.
పరమేక్కావు, తిరువంబడి, చెంపుక్కావు, కరముక్కు, లాలూర్, అయ్యంతోల్, చక్కులతుకావు, నెయ్తలకావు, కణిమంగళం ఆలయాల నుంచి ఉత్సవమూర్తులు త్రిస్సూర్ పురానికి చేరుకునేవి. వడక్కుమ్నాతన్ను నమస్కరించడానికి.. దేవాలయాలను వారి దేవతలతో త్రిస్సూర్ నగరానికి ఆహ్వానించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది.. పూరం నక్షత్రం వచ్చిన రోజున ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగలో ఉపయోగించే ప్రతి వస్తువును.. ప్రతి ఏడాది మొదటి నుంచి తాజాగా తయారు చేస్తారు. గొడుగులు, నెట్టిపట్టం తయారు చేసే బాధ్యతను కొంతమందికి అప్పగిస్తారు.
త్రిస్సూర్ పూరం వేడుకలో పాల్గొనే దేవాలయాలను.. రెండు సమూహాలుగా విభజించారు శక్తిన్ తంపురాన్. పరమెక్కవు వైపు, తిరువంబాడి వైపు అని రెండు గ్రూపులుగా ఇవి ఉంటాయి. ఈ ఆలయాలన్నీ అధిష్టాన దైవమైన శివునికి నమస్కరించడానికి తమ ఊరేగింపులను పంపుతాయి. ఈ ఉత్సవంలో పలు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది జెండా ఎగరేసే కొడియెట్టం కార్యక్రమం. కొడియెట్టంతో.. పూరం అధికారికంగా ప్రారంభమవుతుంది. అసలైన ఉత్సవానికి ఏడు రోజుల ముందు.. జెండా ఎగరేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. త్రిస్సూర్ పూరంలో పాల్గొనే అన్ని దేవాలయాలు.. ఈ వేడుకకు హాజరవుతాయి.
కొడియెట్టం తర్వాత పూర విళంబరం జరుగుతుంది. అంటే, త్రిస్సూర్ పూరం జరిగే వడక్కుమ్నాథన్ ఆలయం దక్షిణ ప్రవేశ ద్వారాన్ని.. ఏనుగు తోసి.. తెరుస్తుంది. ఈ ద్వారం పైన నైతిలక్కవిలమ్మ విగ్రహం ఉంటుంది. పూరం జెండా ఎగురవేసిన నాలుగవ రోజున, శాంపిల్ వేదికెట్టు అని పిలిచే మొదటి విడత బాణసంచా ప్రదర్శన జరుగుతుంది.
బంగారు ఏనుగు అలంకరణ, నెమలి ఈకలతో చేసిన విసనకర్ర, రాజ విసనకర్ర, పవిత్ర గంటలు, అలంకార గొడుగులను… తిరువంబడి, పరమేక్కావు దేవస్థానాలు విడివిడిగా కొత్తగా తయారు చేస్తాయి. పూరం రోజున, తమ ఆలయాల నుండి వచ్చిన భక్తులు.. అలంకారాలతో అలంకరించిన ఏనుగులపై సంగీతంతో వడక్కుమ్నాథన్ ఆలయానికి ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపులే.. ఉత్సవానికి ప్రధాన ఘట్టాలు. తిరువంబాడి బ్రహ్మస్వామ్ మఠం నిర్వహించే.. పంచవాధ్యం కచేరీ అద్భుతంగా ఉంటుంది. మేళంతో సాగే ఊరేగింపు.. వడక్కుమ్నాథన్ ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వడక్కుమ్నాథన్ ఆలయం లోపల.. డోలు, బాకాలు, గొట్టం, తాళంతో కూడిన పూరం కేంద్ర ఆకర్షణలలో ఒకటైన “ఇలంజితరా మేళం” ప్రారంభమవుతుంది.
త్రిస్సూర్ పూరంలోని అత్యంత వైభవ ఘట్టం.. కుడమట్టం. పరమేక్కావు భగవతి ఆలయం, తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయం నుండి చెరో పదిహేను చొప్పున, మొత్తం ముప్పై ఏనుగులను అలంకరించి ఉత్సవ రీతిలో ఒకదానికొకటి ఎదురుగా నిలబడతాయి. ఏనుగుల మీద, గొడుగులు పట్టుకున్నవారు.. వాటిని లయబద్ధంగా తిప్పుతూ చేసే ప్రదర్శననే కుడమట్టం. ఆ తర్వాత త్రిస్సూర్ పూరంలో ప్రధానఘట్టం బాణసంచా. ఇది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదర్శన త్రిస్సూర్ నగరం నడిబొడ్డున, తెక్కింకాడు మైదాన్లో జరుగుతుంది. త్రిస్సూర్ పూరంలో నాలుగు ప్రధాన బాణాసంచా ప్రదర్శనలు ఉంటాయి. పూరం ఏడో రోజు వీడ్కోలుతో ఈ సంబరం ముగుస్తుంది.
Also Read: బెంగాల్లో ఘోరం.. రైలు నుంచి జారిపడ్డ బాలుడు.. పట్టించుకోని సిబ్బంది!