Jangareddygudem: జంగారెడ్డిగూడెం.. ఒక శుభకార్యం ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వెంకటరామాంజిపురంలో విద్యుత్ ఘాతానికి గురై 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మృతుడు నూనె వెంకట సుశాంత్ (11)గా గుర్తించారు. బంధువుల ఇంట్లో వేడుక కోసం వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా తిరిగిరావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
అసలేం జరిగిందంటే..
జంగారెడ్డిగూడెంలోని తన మేనమామ ఇంట్లో జరుగుతున్న మెచ్యూర్ ఫంక్షన్కు సుశాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు. వేడుక సందర్భంగా అతిథుల కోసం పిండి వంటలు చేసేందుకు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో వంట మాస్టర్లు గ్రైండర్ను ఆన్ చేశారు. ఆ సమయంలో ఆడుకుంటూ అక్కడికి వచ్చిన సుశాంత్, అనుకోకుండా ఆ గ్రైండర్ను తాకాడు. మిషన్ నుంచి ఒక్కసారిగా భారీ స్థాయిలో విద్యుత్ ప్రవహించడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
వైద్యుల ప్రయత్నం ఫలించలేదు..
ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో సుశాంత్ను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న కుమారుడు కళ్ల ముందే ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సుశాంత్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిగా చదువుతున్నాడు.
పోలీసుల దర్యాప్తు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై వివరాలు సేకరించారు. గ్రైండర్కు ఎర్తింగ్ లేకపోవడం లేదా వైర్లలో లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసులో బిగ్ అప్డేట్.. హర్యానాలో నిందితుడి అరెస్ట్..!
ఎమ్మెల్యే పరామర్శ..
విషయం తెలుసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సుశాంత్ తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి శుభకార్యాల సమయంలో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సూచించారు.