Madhya Pradesh Crime: దేశంలో ప్రేమ పేరుతో జరిగే దారుణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రేమ అనేది పవిత్రమైన బంధంగా చూడాల్సిన కొందరు.. కామంతో కళ్లు మూసుకుపోతున్నారు. క్షణికావేశంలో యువతి ఉసురు తీసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో అలాంటి ఘటన జరిగింది. ఆసుపత్రిలో అందరి కళ్ల ముందు ఓ యువతిని ఆమె ప్రియుడు దారుణంగా చంపేశాడు. ఇంత జరుగుతున్నా యువతిని కాపాడటానికి ఆసుపత్రి స్టాఫ్ ముందుకు రాలేదు. ఆ సన్నివేశాన్ని వీడియో తీశారు.
మధ్యప్రదేశ్లోని నార్సింగ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఈ ఘటనకు వేదికైంది. ఇంటర్ చదువుతున్న సంధ్య చౌదరి యువతిని ఆమె ప్రియుడు అభిషేక్ కోష్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ సన్నివేశాన్ని అందరూ సినిమా చూసినట్టు చూశారు. ఏ ఒక్కరూ నిందితుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ సన్నివేశాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించారు ఆసుపత్రి సిబ్బంది. ఫలితంగా యువతి స్పాట్లో మృతి చెందింది. రక్తపు మడుగులో పడివున్న యువతి పక్క నుంచి నడుచుకుంటూ కొందరు వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ ఘటన మనషుల్లోని మానవత్వాన్ని ప్రశ్నించింది.
జూన్ 27న మధ్యాహ్నం యువతి సంధ్య ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆసుపత్రిలో స్నేహితుడు వదినను పరామర్శించి వస్తానని కుటుంబ సభ్యులకు తెలిపింది. సంధ్య ఆసుపత్రికి వస్తుందన్న విషయం తెలుసుకున్నాడు ఆమె ప్రియుడు అభిషేక్ కోష్తి. మధ్యాహ్నం నుంచి ఆసుపత్రి చుట్టూ రెక్కీ నిర్వహించాడు. 22వ రూమ్ నంబర్ వద్ద సంధ్యతో కాసేపు మాట్లాడాడు అభిషేక్. మాటల సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కోపంతో ఊగిపోయిన అభిషేక్.. సంధ్యపై చేయి చేసుకున్నాడు. ఆమెను బలంగా కిందకి తోసేశాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఛాతీపై మోకాలితో అదిమిపట్టి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. ఎమర్జెన్సీ విభాగంలో ఇదంతా జరుగుతున్నా ఎవరూ అడ్డుపడే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా నిందితుడి చేతిలో కత్తి ఉండడంతో ఎదురించేందుకు ఓ ఒక్కరూ ముందుకు రాలేదు. ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, డాక్టర్, నర్సులు, వార్డ్ బాయ్స్ అందరు ఉన్నారు. ఆ సన్నివేశాన్ని సినిమా చూసినట్లు చూశారు.
ALSO READ: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్న, కూతురికి వైద్యం చేయించలేక
దాదాపు పావుగంటపాటు సంధ్యపై కత్తితో దాడి చేయడంతో ఆ ఫ్లోర్ రక్తంతో తడిసిపోయింది. ప్రియురాలు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అభిషేక్ నుంచి బైక్ మీద పారిపోయాడు. ఈ ఘటన తర్వాత యువతి కుటుంబ సభ్యులకు సాయంత్రం సమాచారం అందింది. ఆసుపత్రికి వచ్చేవరకు యువతి డెడ్ బాడీ అక్కడే ఉంది. ఆసుపత్రి ఎదుట ఆమె కుటుం సభ్యులు ధర్నా చేశారు. ఘటనకు కారణమైన నిందితుడితోపాటు మిగతా వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. నిందితుడు అభిషేక్ కోష్తి- యువతి సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. వీడియో ఆధారాలు అతని అరెస్టులో కీలక పాత్ర పోషించాయి.