Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఆనందాన్ని పంచుకోవడానికి నిర్వహించిన విజయ యాత్రలో అభం.. శుభం.. తెలియని ఒక బాలిక ప్రాణాలను బలితీసుకుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా, ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య అనే చిన్నారి కారు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. సంబరాలతో మార్మోగాల్సిన వీధులు, ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలతో నిండిపోయాయి.
ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలో వాహనాల వేగం, మితిమీరిన ఉత్సాహం ఈ ఘోరానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమ కళ్ల ముందే చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయిన ప్రజలు, సర్పంచ్ అనుచరులను నిలదీశారు. కారు నడుపుతున్న వ్యక్తి అజాగ్రత్త వల్లే తమ బిడ్డను కోల్పోయామని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే గ్రామంలో పండగ వాతావరణం పోయి భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే, ఈ ఘటనపై సర్పంచ్ భర్త పెంటయ్య వెర్షన్ మరోలా ఉంది. బాలిక కారు కిందపడి చనిపోలేదని ఆయన వాదిస్తుండటం గమనార్హం. తమ ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగిందని, రాజకీయ కక్షలతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఒక పక్క బిడ్డను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు, పెంటయ్య వాదన పుండు మీద కారం చల్లినట్లు అనిపించింది. దీనితో గ్రామస్థులకు, పెంటయ్య వర్గీయులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు కొంతమేర వెనక్కి తగ్గారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా అక్కడి సీసీటీవీ దృశ్యాలను, ప్రత్యక్ష సాక్షుల మాటలను రికార్డు చేస్తున్నారు.
Also Read: దారుణం.. గురువే కిరాతకుడై.. విద్యార్థిపై తోటివారితో దాడి చేయించిన హెడ్ మాస్టర్
అంతేకాకుండా కేవలం గెలుపు మత్తులో అమాయక ప్రాణాలను బలితీసుకోవడం క్షమించరాని నేరమని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సౌజన్య మృతికి కారణమైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాకంచర్ల గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో దారుణం
సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య ర్యాలీలో కారు కిందపడి సౌజన్య(7) అనే బాలిక మృతి
ర్యాలీలో కారు కింద పడలేదంటూ వాదిస్తున్న కమ్లిబాయ్ భర్త పెంటయ్య
దీంతో గ్రామస్థులు పెంటయ్య మధ్య తీవ్ర వాగ్వాదం
పోలీసుల… pic.twitter.com/HWzoNAK1yt
— BIG TV Breaking News (@bigtvtelugu) December 23, 2025