Chit Fraud: స్వేచ్ఛ బ్యూరో: కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కదా అని నమ్మి చిట్టీలు వేస్తే కోటీ యాభై లక్షల రూపాయలు వసూలు చేసి కుటుంబంతో సహా పరారయ్యాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మీర్ పేట శివనారాయణపురం ప్రాంతంలోని వైష్ణవి కాలనీ వాస్తవ్యులైన సౌజన్య, సురేశ్ కుమార్ భార్యాభర్తలు. సురేశ్ కుమార్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఉన్నాడు. ఇదిలా ఉండగా భార్యాభర్తలు కలిసి పదేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. లక్ష నుంచి 10లక్షల చిట్టీలను నిర్వహిస్తున్నారు.
అపుడిస్తా.. ఇపుడిస్తా అని..
వ్యాపారం ప్రారంభించిన తరువాత కొంతకాలం సురేశ్ కుమార్ దంపతులు చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో డబ్బు ఇవ్వటంతో స్థానికులకు వీరిపై నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో పలువురు 2.50 లక్షల నుంచి 10లక్షల చిట్టీల్లో సభ్యులుగా చేరి డబ్బు కడుతూ వచ్చారు. అయితే, కొన్ని నెలలుగా చిట్టీల గడువు ముగిసినా సురేశ్ కుమార్ సభ్యులకు డబ్బు ఇవ్వకుండా అపుడిస్తా.. ఇపుడిస్తా అని కాలం దాటేస్తూ వస్తున్నాడు. గట్టిగా అడిగిన వారికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు. ఇలా దాదాపు కోటీ యాభై లక్షలు బాకీ పడ్డ సురేశ్ తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share