Belt Shops: స్వేచ్ఛ బ్యూరో: ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గద్వాల జిల్లాలోని పట్టణాలు, గ్రామాలలో బెల్ట్ షాపులు జోరుగా నడుస్తుండడంతో యువత మద్యం మత్తులో జోగుతున్నారు .దీంతో కుటుంబంతో పాటు కన్నవారిని సైతం ఎదిరించే స్థితికి దిగజారుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బెల్ట్ షాపులు గల్లీ గల్లీలు, వాడ వాడలో మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో యువకులు మద్యంకు బానిసలై మత్తులో ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాయ కష్టం చేయకుండా కొందరు యువత అవారాగా తిరుగుతూ మద్యానికి బానిసలై డబ్బులు లేనప్పుడు రక్తసంబంధీకులను సైతం ఎదిరించే స్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నా, జిల్లా అధికారులు ప్రజాప్రతినిదులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజలనుంచి వస్తున్నాయి.
అధికారిక వైన్ షాపులు పరిమితంగా ఉండగా బెల్టు షాపులు లెక్కకు మించి గ్రామాలలో విచ్చలవిడిగా వెలుస్తుండడంతో వాటి లెక్కకు అంతే లేకుండా పోతోంది. వైన్స్ ల నుంచి గ్రామాలలో, పట్టణాలలోని శివారు ప్రాంతాలలో మద్యాన్ని కొనుగోలు చేసి బెల్టు షాపుల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలసరి మామూలు తో పాటు ఉన్నతాధికారుల టార్గెట్ కోసం మద్యం షాపుల యజమానులపై ఒత్తిడి తేవడంతో బెల్టు షాపులు బార్ల లాగా మారాయి. పుట్టగొడుగుల్లాగా వెలసిన బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు తెరవాలని మహిళలు,ప్రజలు కోరుతున్నారు.
Also read: మూడు ముక్కల జీహెచ్ఎంసీతో ముప్పు తిప్పలు పడుతున్న జనం.. వెలుగులోకి విచిత్ర పరిస్థితులు..!
మద్యానికి అలవాటు పడ్డ నిరుపేద కుటుంబాలలో వారి ఆర్థిక,ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కుటుంబ బాధ్యతలు చూడాల్సిన ఇంటిపెద్ద మద్యానికి బానిస అవడంతో పిల్లలను, కుటుంబాన్ని పోషించే బాధ్యతను కొందరు మహిళలు మోస్తూ కాయ కష్టం చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. బెల్టు షాపులతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో భార్యాభర్తల మధ్య డబ్బుల విషయంలో చిచ్చు రేపుతున్నాయి. తల్లిదండ్రులు, యువకులకు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడం తో పాటు కుటుంబాలు చిన్నా భిన్న మవుతున్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వాహకులు జోరుగా దందాను నిర్వహిస్తున్నారు.
ఒక్కొక్క గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వాహకులు పోటా పోటీగా లిక్కర్ను విక్రయిస్తూ పచ్చని పల్లెలో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఫలితంగా అనేకమంది వ్యసనానికి భాగించి అనారోగ్య పాలతో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు వారి ఆరోగ్యం బాగు కోసం ఆస్పత్రుల్లో అప్పులు చేసి వైద్యం చేయించాల్సి వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవచూపి బెల్ట్ షాపుల నిర్వహణను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Also read: నర్సింహులపేటలో దారుణం.. గ్యాస్ కొరతతో ప్రజల తీవ్ర ఆందోళన!