Constable Sowmya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9:41 గంటలకు తుదిశ్వాస విడిచారు. జనవరి 23న విధి నిర్వహణలో భాగంగా గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమెను, స్మగ్లర్లు కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమె శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినడంతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడేందుకు ఆరు రోజుల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం
2024 బ్యాచ్కు చెందిన సౌమ్య, నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన వారు. విధి నిర్వహణ పట్ల అంకితభావంతో పనిచేసే ఆమె, గంజాయి అక్రమ రవాణాపై జరిగిన ‘రూట్ వాచ్’ తనిఖీల్లో ధైర్యంగా పాల్గొన్నారు. స్మగ్లర్లు తప్పించుకునే క్రమంలో ఆమెపైకి కారును ఎక్కించడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించింది. చికిత్సలో భాగంగా వైద్యులు ఒక కిడ్నీని కూడా తొలగించాల్సి వచ్చింది. సౌమ్య మరణ వార్త తెలియగానే ఆమె స్వగ్రామం మోస్రాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
నిందితుల అరెస్ట్, సెల్ఫీ వీడియోల కలకలం
ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే సఫీయుద్ధున్, సయ్యద్ సోహెల్ అనే నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ప్రధాన నిందితుడు మతీన్ను కూడా తాజాగా అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు సయ్యద్ సోహెల్ పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తన తల్లికి పంపిన ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. అందులో తమకు గంజాయి స్మగ్లింగ్తో సంబంధం లేదని, మతీన్, రాహెల్, ఆఫ్రోజ్ భార్య తప్పించుకున్నారని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం, నేతల సంతాపం,
సౌమ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా భద్రత కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన సౌమ్య సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే మాదకద్రవ్యాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి సీతక్క దిగ్భ్రాంతి, భరోసా
రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కూడా సౌమ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం వారికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
Also Read: మంచు దుప్పటిలో ఉమ్మడి మెదక్.. రహదారులపై వాహనదారుల అవస్థలు
పోస్టుమార్టం, తదుపరి చర్యలు..
నిమ్స్ ఆసుపత్రిలో మరణించిన సౌమ్య మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాహెల్, ఆఫ్రోజ్ భార్య కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి
హైదరాబాద్-పంజాగుట్ట నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
జనవరి 23న నిజామాబాద్లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య
సౌమ్య మృతిపై సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసిన సీపీ సజ్జనార్
సౌమ్య మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం
Excise… https://t.co/Zb4VpPdRwU pic.twitter.com/sbyXcr0kMt
— BIG TV Breaking News (@bigtvtelugu) February 1, 2026