Municipal Elections: పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితొర్రూరు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తొర్రూరును తాను దత్తత తీసుకుంటానని ప్రకటిస్తూ, అభివృద్ధి హామీలతో ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీలోని రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తునం శ్రావణ్కు మద్దతుగా అన్నారం రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని సర్కిల్ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, మాటలకే పరిమితం కాకుండా చేతలతో పనిచేసే పార్టీ అని తెలిపారు. బిఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన మంత్రి, గత ప్రభుత్వ హయాంలో తొర్రూరు అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులు ఏళ్ల తరబడి సమస్యలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి, తొర్రూరు పట్టణానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఫైర్ స్టేషన్ త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలోని 16 వార్డులకు 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, అభివృద్ధి పనుల్లో ఎలాంటి కొరత ఉండదని, తొర్రూరు అభివృద్ధి తన వ్యక్తిగత బాధ్యత అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, తొర్రూరు అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు…ప్రజల్లోకి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
Also Read; Google Photos AI: గూగుల్ ఫోటోస్లో AI ఎడిటింగ్.. కేవలం వాయిస్తో ఫోటోలు ఎడిట్
మహిళలు, యువత, వృద్ధులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వారి సమస్యలను నోటు చేసుకున్నారు. మంత్రి పర్యటనతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని పార్టీ నేతలు తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని, గత ప్రభుత్వాల హయాంలో పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుందన్న ఆశ ప్రజల్లో వ్యక్తమవుతోందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం రోజురోజుకు బలపడుతుండగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ఎన్నికల పోటీలో కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికార పార్టీ దూకుడు, ఇచ్చిన హామీలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వార్డు ఇన్చార్జీలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: Singer Chitra : బిర్యానీ పై సింగర్ చిత్ర కామెంట్స్.. ఆమె ఫేవరెట్ ఫుడ్ ఇదే..