Minister Ponguleti: రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వే రిపోర్ట్ ఆధారంగానే చేపట్టి, అర్హులైన వారికే బీఫారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో పనిచేసి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju) హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తూ కొందరు మాజీలు పగటి కలలు కంటున్నారని తీవ్రంగా ఎద్దేవా చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. త్వరలోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్లో వర్ధన్నపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తండావాసుల చిరకాల కోరిక మేరకు మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చిన తండాలను తిరిగి గ్రామపంచాయతీలుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని క్యాబినెట్లో చర్చించి, శాసనసభలో ప్రవేశపెట్టి తండాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Bandi Sanjay: కరీంనగర్లో మనదే గెలుపు.. తొందరపడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: బండి సంజయ్
కాంగ్రెస్ పార్టీది ప్రజా ప్రభుత్వమని, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వమని మంత్రి పొంగులేటి(Minister Ponguleti) పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఎమ్మెల్యేలను ఎలా గెలిపించారో, అదే విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కార్పొరేటర్లను గెలిపించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 శాతం సీట్లు కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరే ఈ విజయానికి కారణమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
Also Read: cold wave: మంచు దుప్పటిలో ఉమ్మడి మెదక్.. రహదారులపై వాహనదారుల అవస్థలు