Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలం కైరుగూడ గ్రామంలో పిడుగుపాటుకు గురై దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో తలదాచుకోవడానికి సమీపంలోని ఓ చెట్టు కిందకు ముగ్గురు కూలీలు వెళ్లారు. దురదృష్టవశాత్తూ వారు నిలబడిన చెట్టుపైనే ఒక్కసారిగా పిడుగు పడింది.
ఈ ప్రమాదంలో టెకం భీము (50), ఆయన భార్య రాజబాయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్నుమూశారు. కళ్లముందే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అలాగే వీరితో పాటు ఉన్న ఆత్రం గంగు అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా, ఇలాంటి ప్రమాదాలు జరగడం అందరినీ కలచివేస్తోంది.
Also Read: సీఎం రేవంత్కు మాజీ గవర్నర్ కీలక సూచన.. ఆ ఒక్క నిర్ణయంతో యువతలో మార్పు ఖాయం!