Skill Development: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బిజెపి జిల్లా ప్రశిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతి, యువత భవిష్యత్తు, తెలుగు భాషా ప్రాముఖ్యతపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యువతకు నైపుణ్యం.. వ్యసనాలకు దూరం
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో పాటు, అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశమని విద్యాసాగర్ రావు గుర్తుచేశారు. ఈ మానవ వనరులను సరైన రీతిలో వాడుకోవాలంటే యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాభివృద్ధి) ఎంతో అవసరమన్నారు. వారికి చేతినిండా పని కల్పించడం ద్వారా, నేటి తరం యువతను రకరకాల వ్యసనాలకు లోనుకాకుండా కాపాడుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో చేతివృత్తులపై ఆధారపడి బతుకుతున్న కోట్లాది మందిని గుర్తించి, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి
రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు నైపుణ్య శిక్షణే సరైన మార్గమని విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వరంగల్ నేత కార్మికుడి ఘనత..
మన కళాకారుల ప్రతిభను కొనియాడుతూ.. గతంలో లండన్ లోని క్రిస్టల్ ప్యాలెస్ లో జరిగిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ లో ఎన్నో దేశాలు పాల్గొన్నా, మన వరంగల్ నేత కార్మికుడి ప్రతిభకు మొదటి బహుమతి రావడం మన గడ్డ గర్వించదగ్గ విషయమన్నారు. అలాగే తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉందని, తెలుగు మాట్లాడే వారిలో ఎంతో మంది మేధావులు ఉన్నారని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Also Read: నాడు చంద్రబాబు.. నేడు రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్పై ఇద్దరిదీ ఒకే కుట్ర- జీవన్ రెడ్డి