CP Sajjanar: సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం వాట్సాప్లో “PhonePe రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్”, “సంక్రాంతి కానుక” అంటూ కొన్ని ప్రమాదకరమైన లింకులు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని క్లిక్ చేస్తే రూ.5,000 ఉచితంగా పొందవచ్చని నేరగాళ్లు ఆశ చూపుతున్నారని సీపీ సజ్జనార్ గారు ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.
నేరగాళ్ల సైకలాజికల్ ట్రిక్ గురించి వివరిస్తూ.. “మొదట ఇది నకిలీ అనుకున్నాను.. కానీ నిజంగానే నాకు రూ.5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి!” అంటూ వచ్చే సందేశాలు కేవలం అమాయకులను బుట్టలో వేయడానికేనని గ్రహించాలని సూచించారు. మీకు తెలిసిన వారి నుండి లేదా వాట్సాప్ గ్రూపుల నుండి ఇలాంటి సందేశాలు వస్తే అస్సలు నమ్మకండని అన్నారు.
ఆ మెసేజ్ చివరన ఉండే లింకులు వింత అక్షరాలతో (ఉదా: http://fdgc.lusvv.xyz) ఉంటాయి. ఇవి అధికారిక PhonePe లింకులు కావు. ఆశపడి ఈ లింకులను క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశించి, మీ బ్యాంక్ పిన్, పాస్వర్డ్లను దొంగిలిస్తారు. క్షణాల్లో మీ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉంది. PhonePe, Google Pay వంటి సంస్థలు ఎప్పుడూ వాట్సాప్ లింకుల ద్వారా ఉచితంగా డబ్బులు పంచవు. ఏదైనా ఆఫర్ ఉంటే అది కేవలం వారి అధికారిక యాప్లోనే కనిపిస్తుంది.
ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
సైబర్ నేరాల నుండి మీ ఫోన్ను మరియు బ్యాంక్ ఖాతాను రక్షించుకోవడానికి సెట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన సెక్యూరిటీ సెట్టింగ్స్ ఏంటంటే.. వాట్సాప్, ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతాలకు కచ్చితంగా 2FA ఆన్ చేయండి. దీనివల్ల మీ పాస్వర్డ్ తెలిసినా, మీ ఫోన్కు వచ్చే OTP లేకుండా ఎవరూ లాగిన్ అవ్వలేరు. ప్లే స్టోర్ సెట్టింగ్స్లోకి వెళ్లి ‘Play Protect’ ఆన్ చేయండి. ఇది మీ ఫోన్లోని యాప్స్ను స్కాన్ చేసి హానికరమైన వాటిని గుర్తిస్తుంది.
Read Also: బీర్లు తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి!