Annamayya District: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ వడ్డీపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం సేవించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతులను మణికుమార్ (36), పుష్పరాజ్ (28)గా గుర్తించారు. నిన్న రాత్రి ఆరుగురు యువకులు కలిసి కేవీ పల్లిలోని ఒక మద్యం షాపులో 16 బీర్లు కొనుగోలు చేశారు. అందరూ కలిసి మద్యం సేవించిన కాసేపటికే వారిలో అస్వస్థత మొదలైంది.పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే పీలేరు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే మణికుమార్, పుష్పరాజ్ మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.
ఈ అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆరుగురు వ్యక్తులు 16 బీర్లు సేవించడం వల్ల ‘ఆల్కహాల్ ఓవర్ డోస్’ అయ్యిందా?.. మద్యం షాపులో విక్రయించిన మద్యం ఏమైనా కల్తీ జరిగిందా? గడువు ముగిసిన (Expired) మద్యం సేవించడం వల్ల విషతుల్యంగా మారిందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్టు వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం మరణించిన యువకులు తాగిన మద్యం షాపు నుంచి శాంపిళ్లను సేకరించి పోలీసులు ల్యాబ్కు పంపారు. గతంలోనే అన్నమయ్య జిల్లాలో రూ. 1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు బెల్ట్ షాపుల్లో లేదా అనుమతి లేని చోట్ల మద్యం కొనుగోలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: ఫిలింనగర్లో కారు బీభత్సం: పల్టీలు కొట్టిన వాహనం.. ప్రాణభయంతో ప్రయాణికుల పరుగులు!