Cyberabad Police: చదువులమ్మ నీడలో చల్లగా పెరగాల్సిన పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సైబరాబాద్ ఉమెన్, చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం హెచ్చరించారు. సైబర్ టవర్ జంక్షన్ వద్ద తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఇలాగే భిక్షాటన చేస్తున్నఅయిదుగురిని కాపాడినట్టు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
హైదరాబాద్లోని ఏ చౌరస్తాలోచూసినా కొంతమంది పిల్లలను వెంటబెట్టుకుని భిక్షాటన చేస్తూ ఉండటం సర్వసాధారణంగా కనిపించే దృశ్యమే. కొందరు తమ తమ పిల్లలకు మహాత్మాగాంధీ వేషం వేయించి రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల వద్ద పంపిస్తూ వారితో భిక్షాటన చేయిస్తున్నారు. ఇటీవల ఇలాగే అయిదుగురు పిల్లలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద భిక్షాటన చేస్తుండగా మాదాపూర్ పోలీసులు వారిని రక్షించారు. అనంతరం బాలల సంరక్షణ సంస్థల సహకారంతో వారికి పునరావాసం కల్పించి కొత్త జీవితాన్ని అందించారు. అదే సమయంలో పిల్లల తల్లిదండ్రులను అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: Euphoria Movie: ‘యుఫోరియా’ స్పెషల్ ప్రీమియర్ చూసి ఎమోషనల్ అయిన భూమిక.. ఏం చేశారంటే?
పిల్లలు ఉండాల్సింది బడిలో…భిక్షాటనలో కాదని సైబరాబాద్ ఉమెన్, చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం చెప్పారు. కాసింత డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాల రాస్తూ, వాహనాల మధ్య భిక్షాటన చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారన్నారు. చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరమని చెప్పారు. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా.. చట్టం నుండి తప్పించుకోలేరన్నారు. “పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు” అన్న నినాదంతో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పిల్లలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు.