Chittoor Leopard Attack: చిత్తూరులో మండలం వడ్రంపల్లి లో లేగదూడపై చిరుతపులి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. వడ్రంపల్లి గ్రామానికి చెందిన రైతు ఎం. కిషోర్కుమార్ ప్రతిరోజు మాదిరిగానే గురువారం ఉదయం తన దూడను మేతకు తీసుకెళ్లి పంట పొలంలో వదిలి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత చూసేసరికి దూడ రక్తపుమడుగుల్లో పడి ఉంది. దూడ శరీరంపై పెద్ద పెద్ద గోరుముద్రలు, పళ్ల గాట్లు ఉండటంతో చిరుత పులి దాడి చేసిందని అర్థమైంది.
వెంటనే ఈ విషయం అటవీ అధికారులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి ఫారెస్ట్ రేంజర్ కరణ్, వెటర్నరీ డాక్టర్ శిరీష బృందంతో చేరి దూడ శవాన్ని పరిశీలించారు. వెటర్నరీ నిపుణుల ప్రాథమిక నివేదిక ప్రకారం ఇది నిజంగా చిరుత పులి దాడేనని తేలింది. జంతువు మెడ, పొట్ట భాగాల్లో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వారు నిర్ధారించారు.
అధికారులు మాట్లాడుతూ.. దూడ మృతి కారణం స్పష్టంగా చిరుత పులి దాడే. దాని పంజా ముద్రలు, అడుగుల ఆనవాళ్లు సమీప పొలాల్లో కూడా కనిపించాయి. గ్రామ పరిసరాల్లో పులి సంచారం ఉండే అవకాశం ఉంది అని తెలిపారు. అలాగే, పులిని గుర్తించడానికి సమీప అడవుల్లో కెమెరా ట్రాపులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లరాదు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పశువులను సమీప గ్రామాల వద్దే మేతకు వదలాలి అని సూచించారు.
గ్రామ పరిసరాల్లో ఇప్పటికే రెండు వారాలుగా చిరుత పులి కదలికల గుర్తులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం అదే ప్రాంతంలో రెండు మేకలు కూడా మృతిచెందిన ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో అధికారులు పులి అడవిలోకి తిరిగి వెళ్ళేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య
గ్రామ పరిసర ప్రాంతాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. అదే సమయంలో పులి కదలికలపై పర్యవేక్షణ కొనసాగుతోంది. గ్రామస్థులకు భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా పులి కదలిక గమనించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.