దేశ రాజధానిలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం ఆరేళ్ల వయసున్న పసిబాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా ప్రాంతంలో ఈ అమానుషం చోటుచేసుకుంది.
తినే పదార్థాలు ఇస్తామని ఆశ చూపి..
పోలీసుల కథనం ప్రకారం.. జనవరి 18వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలి పొరుగునే ఉండే 13 ఏళ్ల బాలుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాలిక వద్దకు వెళ్లాడు. చిరుతిళ్లు ఇస్తామని ఆశ చూపి ఆమెను సమీపంలోని ఒక ఖాళీగా ఉన్న రెండంతస్తుల భవనంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి నోటికి గుడ్డలు కట్టి, చేతులు కట్టేసి ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
రక్తస్రావంతో ఇంటికి చేరిన చిన్నారి
నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాలిక తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. చిన్నారి పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురైన తల్లి, ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
నిందితులంతా మైనర్లే..
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి వయస్సు 10, 13, 14 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా గత ఏడాది మరణించిన బాధిత బాలిక సోదరుడికి స్నేహితులు కావడం గమనార్హం. తెలిసిన వారే ఇలాంటి ఘాతుకానికి పాల్పడటంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోంది. నిందితులపై పోక్సో (POCSO) చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరు అదుపులోకి.. ఒకరు పరారీ
ఘటనపై దర్యాప్తు చేపట్టిన భజన్ పురా పోలీసులు ఇప్పటికే ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మూడవ నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కుటుంబం ఇంటికి తాళం వేసి పారిపోవడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చిన్న వయస్సులోనే ఇలాంటి నేరాలకు పాల్పడటం సామాజికంగా ఆందోళన కలిగిస్తోంది.
ALSO READ: Medaram Jatara: మేడారం జనారణ్యం.. వనదేవత సమ్మక్క ఆగమనం.. గాల్లోకి ఎస్పీ కాల్పులు..