Army Vehicle Accident: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆ వాహనంలో మెుత్తం 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భదేర్వా- పఠాన్కోట్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిబ్బందిని తరలిస్తున్న క్రమంలో మలుపు వద్ద వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. స్థానికులు, ఆర్మీ సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషాద కరమైన ఘటనపై సైనిక ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ALSO READ: కుట్రలను తిప్పికొడదాం.. పార్టీ ప్రతిష్ఠను కాపాడదాం.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు