Palnadu Double Murder: పల్నాడు జిల్లాలో మరోసారి దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తిలను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపడం గ్రామంలో తీవ్ర భయాందోళనకు దారి తీసింది.
పెద్ద అన్న హనుమంతును గ్రామంలోని బొడ్రాయి సమీపంలో హత్య చేశారు. అదే సమయంలో తమ్ముడు శ్రీరామమూర్తిని నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ వద్ద దుండగులు హతమార్చారు. రెండు చోట్ల ఒకే సమయంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ హత్యలు ముందస్తు ప్రణాళికతోనే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అన్నదమ్ములు ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు.. స్థానిక రాజకీయాలు, గ్రామ సమస్యలపై చురుగ్గా స్పందించే వారు కావడంతో ఈ హత్యలు రాజకీయ కోణంలోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రాథమికంగా కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అర్ధరాత్రి వేళ జరిగిన ఈ దాడుల్లో ఇద్దరిపై పదునైన ఆయుధాలతో.. వరుసగా దాడులు చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఉదయం గ్రామస్తులు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న దుర్గి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
హత్యల వెనుక కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు కానీ, వ్యక్తిగత శత్రుత్వం ఉందా అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అలాగే గ్రామంలో ఉన్న రాజకీయ వాతావరణం, పాత గొడవలు, బెదిరింపులు వంటి అంశాలనూ పరిశీలిస్తున్నారు.
ఈ జంట హత్యలతో అడిగొప్పుల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సైతం వెనకాడుతున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
పల్నాడు జిల్లాలో గతంలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. తాజా జంట హత్యలు మరింత కలకలం రేపుతున్నాయి. పోలీసులు త్వరితగతిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.