Filmnagar Rash Driving: భాగ్యనగర వీధులు ఇటీవల ‘రేస్ ట్రాక్’లను తలపిస్తున్నాయి. మితిమీరిన వేగం, మద్యం మత్తు, ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వెరసి హైదరాబాద్లో రష్ డ్రైవింగ్ ప్రాణాంతక సమస్యగా మారింది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో యువత ఖరీదైన కార్లు, బైక్లతో విన్యాసాలు చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఫిలింనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు జనసంచారం ఉన్న హోటల్ సమీపంలో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిలింనగర్ మెయిన్ రోడ్డులోని ఒక ప్రముఖ హోటల్ వద్దకు రాగానే, వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఆ వేగాన్ని చూస్తుంటే కారు ఏదో సినిమా స్టంట్ చేస్తున్నట్లుగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు తమ మీదికి వస్తుందేమోనన్న భయంతో హోటల్లో ఉన్న కస్టమర్లు మరియు రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.
కారు పల్టీలు కొట్టిన వెంటనే, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి అక్కడి నుండి పరారయ్యారు. వారు మద్యం మత్తులో ఉన్నారా లేక రేసింగ్కు పాల్పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మరియు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు నంబర్ ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హోటల్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేవలం క్షణకాలపు థ్రిల్ కోసం విచక్షణారహితంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు, సీసీటీవీ నిఘా పెంచినప్పటికీ, వాహనదారుల బాధ్యతారాహిత్యం వల్ల ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ తరహా ప్రమాదాలు వార్తల్లో నిలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
Read Also: Medak Crime: రూమ్ మేట్స్ మధ్య డబ్బుల చిచ్చు.. రూ. 22 లకు హత్య, మెదక్ జిల్లాలో దారుణం