Student Suicide: నల్గొండ జిల్లాలోని రవీందర్ నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని కొత్తల మర్రి గూడెం గ్రామానికి చెందిన శృతిగా గుర్తించారు.
అయితే ఉన్నత చదువులు చదవాలనే కోరికతో ఉన్న శృతి, ఇంట్లో కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లిచూపులు ఏర్పాటు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు, హాస్టల్ సహచరులు ఆరోపిస్తున్నారు. చదువును కొనసాగించాలన్న తన ఆశకు పెద్దల నిర్ణయం అడ్డురావడంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తోంది.
శృతి చదువుల్లో చురుకుగా ఉండేదని, డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే బలమైన ఆకాంక్షను కలిగి ఉండేదని తెలిపారు. అయితే, ఈ పెళ్లి విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఆమె ఆశయాలకు విరుద్ధంగా మారింది.
దీంతో పెళ్లి చూపుల విషయం ఇంట్లో నడుస్తుండడంతో, తన జీవిత లక్ష్యాలు దెబ్బతింటాయనే ఆందోళనతో ఆమె తీవ్ర మానసికంగా కుంగిపోయింది. తన కలలు సాకారం కావేమోననే భయంతో, కుటుంబ సభ్యులకు ఈ విషయంపై చెప్పలేక, తీవ్ర నిరాశకు గురై హాస్టల్ గదిలో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటన హాస్టల్లోని తోటి విద్యార్థులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Also Read: అనకాపల్లిలో కలకలం.. ఆరుగురు టెన్త్క్లాస్ స్టూడెంట్స్ మిస్సింగ్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి హాస్టల్ సిబ్బందిని, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై సైదులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శృతి ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు శృతి ఇష్టం లేని పెళ్లి వల్లే చనిపోయిందా? లేదా మరేదైన కారణం ఉందా? అనే కోణంలో కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని, దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.