Students Missing: ఏపీలో షాకింగ్ ఘటన.. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం, బీసీటీ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరంతా బీసీటీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. అయితే సాధారణంగా పాఠశాల నుండి ఇంటికి వెళ్లాల్సిన సమయం దాటినా విద్యార్థులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే నిన్న మధ్యాహ్నం నుండి విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుండి అదృశ్యమైనట్లు తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఒకేసారి ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో ఇది తీవ్రమైన అంశంగా పరిగణించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు పాఠశాల నుండి ఎటువైపు వెళ్లారు? వారి చివరి ఆచూకీ ఏంటి? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు ఎవరితోనైనా మాట్లాడారా, లేదా ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
విద్యార్థుల సెల్ ఫోన్ డేటా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ అదృశ్యం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? కేవలం అల్లరి పనుల వల్ల ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఒకేసారి ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోవడం, వారి గురించి ఎటువంటి సమాచారం దొరకకపోవడం వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ పిల్లల భద్రత గురించి, వారి ఆరోగ్యం గురించి తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. పాఠశాల యాజమాన్యం సైతం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Also Read: డ్రైవర్ డ్రంకెన్ డ్రైవింగ్.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్లో
విద్యార్థుల అదృశ్యానికి గల కారణాలను తెలుసుకునేందుకు వారు కూడా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. త్వరగా విద్యార్థులు సురక్షితంగా తిరిగి రావాలని స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. పోలీసులు తమ గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.