Highway Robbery: కర్ణాటకలోని హవేరి జిల్లాలో సినీ ఫక్కీలో దారి దోపిడి జరిగింది. కదులుతున్న ట్రక్ నుంచి రూ.25 లక్షల విలువైన మెుబైల్స్ ను దొంగలు దోచేశారు. చోరికి గురైన మెుబైల్స్ అన్నీ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్టుకు చెందినవిగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
హవేరి జిల్లాలోని 48వ జాతీయ రహదారి(NH-48)ఈ భారీ చోరి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి ధార్వాడ్ జిల్లా (Dharwad district)లోని కోటూరు గ్రామం (Kotur village)లో ఉన్న ఫ్లిప్ కార్ట్ గిడ్డంగి (Flipkart Warehouse)కి మెుబైల్స్ తరలిస్తుండగా ఈ దొంగతనం జరిగింది. నిందితులు లింక్డ్ లాకింగ్ పరికరం ( linked locking device)ను ట్యాంపర్ చేసి పగలగొట్టారు. అనంతరం మెుబైల్స్ తో ఉన్న 6 పెద్ద పెట్టెలను దోచేశారు. ఆ బాక్సుల్లోని మెుబైల్స్ విలువ దాదాపు రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాణేబెన్నూర్ తాలూకాలోని కాకోల్ – మోటేబెన్నూర్ మార్గాల మధ్య లారీ ప్రయాణిస్తున్న క్రమంలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రహదారుల వెంట దారిదోపిడికి తెగబడే ముఠాలు ఈ చోరికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైవేలపై దారిదోపిడి ఘటనలు పెరిగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. దారి దోపిడిలో బాగా అనుభవం ఉన్న క్రిమినల్స్ ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటున్నారు.
Also Read: IND VS USA: ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే..300 కొట్టడం పక్కా, బుమ్రా, సంజు దూరం
హైవేపై లారీని దోచేసిన ఘటనపై రాణేబెన్నూరు గ్రామీణ పోలీసులు (Ranebennur Rural Police Station) కేసు నమోదు చేశారు. అనుమానితుల కదలికలను తెలుసుకునేందుకు NH-48 ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. చోరికి పాల్పడిన ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని.. నిందితుల అరెస్టుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.