Forced Abortion Attempt: నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మహేష్ , భాగ్య గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది జనవరి 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. వివాహ సమయానికే భాగ్య నాలుగు నెలల గర్భవతి. ఈ వివాహం ఇష్టం లేని ఆమె తండ్రి , బావ ఆమె గర్భాన్ని బలవంతంగా తొలగించాలని నిర్ణయించుకున్నారు.
కల్వకుర్తి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భాగ్యకు ఆమె ఎటువంటి ఇష్టం లేకుండా.. బలవంతంగా అబార్షన్ చేయించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. తన ఇష్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఈ అమానుష ఘటనపై భర్త మహేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడంలో జాప్యం చేశారని బాధితుడు ఆరోపించారు.
న్యాయం కోసం మహేష్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించిన కమిషన్.. మహిళా స్వేచ్ఛకు ,ఆమె సమ్మతికి విరుద్ధంగా గర్భస్రావం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది. గర్భిణీ మహిళ రక్షణ కోసం తక్షణమే రంగంలోకి దిగాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.
కల్వకుర్తి సీఐ ,వంగూరు ఎస్హెచ్వోలు బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించాలని కమిషన్ సూచించింది. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఫిబ్రవరి 26 నాటికి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
Also Read: ఛీ.. ఛీ.. ఇదేం సమాజం? చనిపోయిన వ్యక్తిపై కూడా కుల వివక్షా?