Bengaluru: బెంగళూరు శివార్లలోని ఫాక్స్కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. కేవలం 19 ఏళ్ల వయసున్న యువతి, సమాజానికి భయపడి తాను కన్న పేగు బంధాన్నే తెంచేసుకోవడం అత్యంత విషాదకరం. పెళ్లి కాకుండా గర్భం దాల్చానన్న విషయం బయటపడితే పరువు పోతుందన్న ఆందోళన ఆమెను ఒక రాక్షసిలా మార్చేసింది.
బుధవారం డ్యూటీలో ఉన్న సమయంలోనే ఆమెకు నొప్పులు రావడంతో, ఎవరికీ అనుమానం రాకుండా వాష్రూమ్లోకి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు ఏడుపు వినిపిస్తే ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో, కనికరం లేకుండా ఆ బిడ్డ గొంతు కోసి చంపేసింది. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక బ్యాగులో పెట్టి అక్కడే వదిలేసి ఏమీ తెలియనట్టు బయటకు వచ్చింది. కానీ తోటి మహిళా ఉద్యోగి వాష్రూమ్కు వెళ్లడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. యువతి గర్భవతి అన్న విషయం తోటి ఉద్యోగులకు గానీ, యాజమాన్యానికి గానీ తెలియకుండా ఆమె జాగ్రత్త పడిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. లోకం ఏమనుకుంటుందో అన్న భయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, ఒక యువతి జీవితాన్ని జైలు పాలు చేసింది.
Also Read: రెండేళ్ల పగ.. టీచర్ ను రాడ్డుతో కొట్టిన స్టూడెంట్